ప్రస్తుతం రాజకీయంగా నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ట్విట్టర్లో ఇటు వైసీపీ, అటు టీడీపీలోని కీలక నేతలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. బహుశ దీనిని ఫాలో అవుతున్న టీడీపీ శ్రేణులు కొందరు.. వాట్సాప్ , ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లో కొందరిని టార్గెట్ చేస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది.
విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు తనయుడు లోకేష్ ఘోరంగా పరాజయం పాలయ్యారు. ఇక్కడ నుంచి వరుసగా ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. అయితే, ఈయనను టార్గెట్ చేస్తూ.. కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు కుమ్మరించారు. ఆర్కేను లేపేస్తాం. మంగళగిరి నుంచి తరిమి కొడతాం అంటూ హెచ్చరించారు. దీంతో ఆళ్ల పోలీసులను ఆశ్రయించారు.
నిజానికి సోషల్ మీడియా అనేది భావ వ్యక్తీకరణకు చక్కని వేదిక. అయితే, ఇటీవల కాలంలో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలకూ చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రత్యర్థులపై పరుష పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకువచ్చిన ఐటీ చట్టం వీరి దూకుడు బ్రేకులు వేస్తోంది. ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని తాజాగా ఆర్కే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో సోషల్ మీడియాలో నాపై బెదిరింపు ధోరణితో పోస్టులు పెట్టారు. చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేశారు.
మా నాయకుడిని జైలుకు పంపుతామని.. నన్ను చంపుతామని.. మంగళగిరి నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది. భద్రత కల్పించాలని ఫిర్యాదులో పొందుపరిచాను’ అని ఆర్కే చెప్పడాన్ని బట్టి పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి దీనిపై లోకేష్ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.