ఏ దేశ మేగినా ఎందు కాలిడినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని- అన్న రాయప్రోలు మాటను అక్షర సత్యం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం ఆయన అమెరికాలోని డల్లాస్లో తెలుగు వారితో మమేక మయ్యారు. దాదాపు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం సతీమణితో కలిసి అమెరికా వెళ్లిన జగన్.. అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన డల్లాస్లోని తెలుగువారితో సమావేశ మయ్యారు. వాస్తవానికి ఏపీ నుంచి ఏ నాయకుడు అమెరికా వెళ్లినా.. అక్కడి వారిని ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించడం కామన్. వసతులు కల్పిస్తామని చెప్పడం కూడా కామనే.
కానీ, జగన్ దీనికి భిన్నంగా మీరు-మేము ఒక్కటే.. ఇది మీ ప్రభుత్వం అంటూ.. ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడమే ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి కారణమైంది. నిజానికి గతంలో చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ కూడా అమెరికా వెళ్లారు. ఈ క్రమంలోనే వారు కూడా పెట్టుబడులను ఆహ్వానించారు. కానీ, అమెరికాలోని తెలుగువారు, ఏపీలోని తెలుగువారు వేర్వేరుగా,, వారు పెట్టుబడులు పెట్టే వారిగా.. వీరు అనుభవించేవారిగానే చిత్రీకరించారు. తప్ప.. అందరూ ఒక్కటే అనే భావనను కల్పించడంలో కనీసం ఆ ఆలోచనను కూడా చేయలేక పోయారు.
``అమెరికాలో అమెరికన్లతో పాటు వారికి మించి ఎదుగుతున్న మీ అందరినీ చూసి మేమెంతో గర్వప డుతు న్నాం. మా దేశానికి భారతీయ సమాజం ఎంతో మేలు చేసిందని అమెరికా అధ్యక్షుడు సైతం ప్రత్యేకంగా మన తెలుగువారి గురించి.. మన భారతీయుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఎంతో గర్వపడతాం. ఇక్కడ భారతీయలు దాదాపు 41 లక్షల మంది ఉన్నారు. వీరిలో 4 లక్షల మంది తెలుగువారే. మన రాష్ట్రాన్ని విడి చిపెట్టి వచ్చి ఇక్కడ స్థిరపడి రాణిస్తున్నారంటే.. ముఖ్యంగా ఈ ప్రతిభను చూసి ముచ్చటేస్తోంది`` అన్న జగన్ వ్యాఖ్యలకు ఫిదా కాని ఎన్నారై అంటూ లేరంటే అతిశయోక్తి అనిపించకమానదు.
ఇక, తాను ఎక్కడికి వెళ్లినా ఆ నగరం మాదిరిగా ఏపీని మార్చేస్తానంటూ.. గత సీఎం చంద్రబాబు చెప్పేవా రు. ఆయన సింగపూర్ వెళితే.. ఏపీని సింగపూర్ చేస్తానని, ఆయన దుబాయ్ వెళ్తే.. అమరావతిని దుబాయ్ చేస్తానని ఇలా ఆయన ఎక్కడికి వెళ్తే. అక్కడ ఇలా వ్యాఖ్యలు చేసేవారు. అయితే, దీనికి భిన్నంగా ఏపీని ఏపీగానే అభివృద్ధి చేస్తామని, మా కంటూ ఓ విజన్, కొన్ని నిర్ణయాలు ఉన్నాయని స్పష్టం చేశారు జగన్. ఈ పరిణామాన్ని మేధావి వర్గాలు సైతం స్వాగతిస్తున్నాయి. నిజానికి విదేశీయులు కూడా ఎవరి అస్తిత్వాన్ని వారు కాపాడుకోవాలనే భావిస్తారు తప్ప.. ఎక్కడికెళితే.. అక్కడి సంస్కృతిని కాపీ కొట్టాలని ఎవరూ అనుకోరు. మొత్తానికి జగన్ తన అమెరికా పర్యటనలో ఈ తరహా విజయం సాధించడం గమనార్హం అంటున్నారు పరిశీలకులు.