ఉత్తరప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీలో తనదైన ప్రత్యేక ముద్రను వేసుకున్న సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో మరో కీలక పరిణామం తెరమీదకు వచ్చింది. బీజేపీలోకి ఎస్పీ సీనియర్ నేతల వలసలపై ఆందోళన చెందుతున్న పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సారధ్య బాధ్యతలను ఆ చేపట్టనున్నారని చర్చ జరుగుతోంది. పార్టీ నేతలందరినీ కలుపుకుని పోగల రాజకీయ చతురత తనయుడు అఖిలేశ్ యాదవ్కు లేదని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఈ చర్చ తెరమీదకు వస్తోంది.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బహుజన్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో ఎస్పీ పునాదులు శరవేగంగా కదులుతున్నాయని, బీజేపీలోకి పార్టీ రాజ్యసభ సభ్యుల వలసలు పెరిగిపోయాయని ములాయం ఆందోళన చెందుతున్నారని ఆయన సన్నిహిత వర్గాల కథనం. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన నాయకత్వ పోరులో అఖిలేష్ పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం బాధ్యతలు వదిలేసిన ములాయంసింగ్ యాదవ్ తిరిగి భావిస్తున్నారని సమాచారం. ఈ విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి, సోదరుడు రాంగోపాల్ యాదవ్ను ములాయం...లక్నోలోని పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడినట్లు వార్తలొచ్చాయి. పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్తో మాట్లాడటంతోపాటు అధినేత మార్పు కోసం జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలియవచ్చింది.
రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ములాయం ఆందోళనకు గురయ్యారు అని చెప్పారు. మరో ఎస్పీ నేత మాట్లాడుతూ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అఖిలేశ్ తన తండ్రి ములాయం, బాబాయి శివ్పాల్ యాదవ్ విధేయులను తప్పిస్తూ ముందుకు వెళ్లారు అని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంజయ్ సింగ్, ఎస్పీ మాజీ ఎంపీలు సంజయ్ సేథ్, సురేంద్రసింగ్లు ఆదివారం బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఎస్పీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. పార్టీ వ్యవహారాలు నడిపే రాజకీయ చతురత అఖిలేశ్కు లేదని నేతాజీ (ములాయం) ఒప్పుకొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు సారధ్య బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, తండ్రి ఆకాంక్షపై అఖిలేశ్ సానుకూలంగా స్పందించలేదని సమాచారం.