ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాలకు వేదికగా మారిన విషయం తెలిసిందే. తాను ఏం చేసినా.. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఖజానా కళకళలాడడం కోసమే చేస్తున్నానని అత్యంత ధైర్యంగా చెబుతున్న ఆయన.. ఇప్పటి వరకు తీసుకున్న ఏ నిర్ణయంలోనూ ఎన్ని ఒత్తిడులు వచ్చినా వెనుకడుగు వేయలేదు. ఇప్పటి వరకు ఆయన దూసుకుపోతూనే ఉన్నారు. పాలన ప్రారంభించిన కేవలం రెండు మాసాల్లోనే రెండు వందల నిర్ణయాలు తీసుకున్న సీఎంగా ఆయన దేశంలోనే గుర్తింపు పొందారని అంటున్నారు వైసీపీ సీనియర్లు.
ఇక, ఈ దూకుడులోనే ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి విషయంలోనూ తన తండ్రి పాలనను, తన తండ్రి వైఎస్ ను అనుసరిస్తున్న జగన్.. ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. ఎన్నికల సమయంలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన జీవించి ఉండగా, ముఖ్యంగా సీఎంగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు చేరువ య్యేందుకు ప్రారంభించిన కార్యక్రమాన్ని తిరిగి జగన్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఇప్పడు జగన్ ప్రారంభించాలని , తన తండ్రి ఎంతో కలలు కన్న కార్యక్రమాన్ని తాను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అది కూడా వచ్చే నెల 2 అంటే వైఎస్ వర్ధంతి సందర్భంగా జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అది కూడా వైఎస్ ఎక్కడైతే.. ప్రారంభించాలని అనుకున్నారో.. అక్కడే మొదలు పెట్టి తండ్రి రుణం తీర్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి రెండో సారి ఉమ్మడి సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజలకు మరింత చేరువ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సమస్యలను నేరుగా చూడాలని, నేరుగా వారితో మాట్లాడి వారి సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తొలి ఏడాదిలో నే ప్రతిష్టాత్మక రచ్చబండ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు.
దీనికిగాను ఆయన ఎంచుకున్న నియోజకవర్గం చిత్తూరు జిల్లా చంద్రగిరి. ఇక్కడ సెప్టెంబరు 2న కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆయన బయలు దేరారు. అయితే, అప్పటికే వాతావరణం అననుకూలంగా ఉందని సమాచారం అందినా.. పెద్దగా ప్రమాదం ఏమీలేదని భావించిన వైఎస్ ఈ కార్యక్రమానికి బయలుదేరారు. అయితే, ఆయన కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పావురాల గుట్ట సమీపంలో హెలికాప్టర్ కూలి ప్రమాదానికి గురై మరణించారు.
దీంతో ఇప్పుడు అదే కార్యక్రమాన్ని, జగన్ అక్కడే చంద్రగిరిలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు సీఎంవో వర్గాలు చెబుతున్నారు. వచ్చే సెప్టెంబరు 2న కడప వెళ్లి వైఎస్ సమాధికి నివాళులు అర్పించి, ఆ వెంటనే ఆయన చంద్రగిరికి వెళ్లి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు చేరవ కావాలని నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. మొత్తానికి తండ్రి రుణం తీర్చుకుంటున్న నాయకుడిగా జగన్ చరిత్ర సృష్టించనున్నారు.