ఈ రోజుల్ల్లో రైళ్ళు బస్సులు అంటేనే నరకానికి దగ్గర దార్లుగా మారిన పరిస్థితి. ఏ బస్సు ఎక్కినా గోదారే, ఏ రైలు ఎక్కినా స్వర్గానికి దగ్గర దారే అన్నది నిజమవుతోంది. ఇలా ప్రాణాలు అరచేత పట్టుకుని బడుగు జీవులు బిక్కుబిక్కుమని తప్పనిసరి పరిస్థితుల్లో రైళ్ళు, బస్సులు ఎక్కుతున్నారు. ఇక డ్రైవర్ల నిర్వాకం, నిర్లక్ష్యం చెప్పనవసరం లేదు. వారికి తోచిందే తీరుగా నడుపుకుంటూ పోతున్నారు. వెనకా ముందు అసలు చూడడంలేదు. అలా విశాఖ ఎక్స్ప్రెస్అ ఇంజన్ డ్రైవర్ నిర్లక్షంతో ఏకంగా బోగీలనే వదిలేసి పారిపోయాడు. ఈ భయానక ఘటన విశాఖ జిల్లా నర్శీపట్నంలో ఈ రోజు సాయంత్రం జరిగింది.
ఎప్పటిలాగానే విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్కు విశాఖ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. అలా బయలుదేరిన విశాఖ ఎక్స్ప్రెస్ నర్శీపట్నం రాగానే ఇంజర్ డ్రైవర్ కి ఒక్కసారిగా ఏమైందో తెలియదు వేగంగా పోనిచ్చేశారు. దాంతో ఇంజనుకు బోగీలకు మధ్య లింక్ తెగిపోయింది. నర్సీపట్నం వద్ద బోగీలను వదలి 20 కిలోమీటర్ల వరకు ఇంజన్ ముందుకు వెళ్లినా డ్రైవర్ చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
ఇక ఆ ఇంజన్ లేని రైలు ఆ స్పీడ్ తోనే అలా వేగంగా వెళ్తూ నక్కపల్లి నుంచి నర్సీపట్నం స్టేషన్ దాటి కొంతదూరం వెళ్లిన తర్వాత రైలు ఆగిపోయింది. ఇంజన్కు బోగీలకు మధ్య ఉన్న లింకు రాడ్లు విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రైల్వే సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మరమ్మతులు చేశారు. ఆ వెంటనే తిరిగి రైలు బయలుదేరింది. దీంతో ప్రయాణీకులు ఊపిరి తీసుకున్నారు.
ఈ విషయం ఇలా ఉంటే అసలు రైల్వే శాఖ ప్రయాణీకుల జీవితాలతో ఎంతలా చెలగాటం ఆడుతోందన్నది ఈ ఘటన తెలియచేస్తోంది. ఒకటి రెండు కాదు, ఏకంగా ఇరవై కిలోమీటర్ల దూరం బోగీలు లేకుండా ఇంజన్ వెళ్ళిపోవడం బట్టి చూస్తే ఆ డ్రైవర్ మతిలో ఉన్నాడా అన్నది అర్ధం అవడంలేదు. మరి ఇలాంటి వారిని డ్రైవర్లుగా పెట్టి రైలు బండి ఎక్కమంటే తిన్నగా ఎక్కడికి తీసుకువెళ్తాడో కూడా అర్ధం కాదు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. రైల్వే డ్రైవర్ల దూకుడు వల్ల ఎందరో అమాయకులు చనిపోయారు. నాలుగేళ్ళ క్రితం విజయనగరం జిల్లాలో వద్ద దసరా పండుగ వేళ చాలా మంది మీదకు రైలు ఎక్కించేసిన ఘటన కూడా రికార్డ్ అయి ఉంది మరి. ఇటువంటి సంఘటను ఎన్నో జరుగుతున్నా కూడా రైల్వే శాఖ ఎందుకు పట్టించుకోదో, ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి.