తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఆపరేషన్ కమలం ను వేగవంతం చేసింది . తెలంగాణలో ఆ పార్టీలో ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరికతో ఊపుమీదున్న బిజెపి నాయకత్వం, ఇక ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించాలని భావిస్తోంది .టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల చేరిక అనంతరం బీజేపీలోకి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా చేరుతారన్న ఊహాగానాలు జోరుగా వినిపించాయి.
అయితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేకపోవడంతో, ప్రస్తుతానికి తెలంగాణపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది . తెలంగాణలో టి - టిడిపిని ఖాళీ చేయడంలో సక్సెస్ అయిన బిజెపి నాయకత్వం , ఇక ఏపీలో ను ఆ పార్టీ కి చెందిన పలువురు అసంతృప్తులపై గాలం వేస్తున్నట్లు సమాచారం . ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు , ఇప్పటికే బిజెపి జాతీయ నాయకులతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది . కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తో ఇటీవల బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమైనట్లు తెలుస్తోంది .
ఆదినారాయణరెడ్డి ని బిజెపి లో చేరవలసిందిగా నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం . ఆది మాత్రం ఆలోచించి చెబుతానని ప్రస్తుతానికి పార్టీ లో చేరే అంశాన్ని దాటవేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చిన ఆదినారాయణ రెడ్డి టీడీపీ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్న విషయం తెల్సిందే . ఇటీవల ఏపీ లో టీడీపీ ఘోర పరాజయం తరువాత ఆయన బీజేపీ లో చేరుతారన్న ప్రచారం కొనసాగుతోంది . అయితే ఆది మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు .