ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాహుబలి అయితే... ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి సైరా నరసింహారెడ్డి లాంటివారిని వైసిపి నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కే. రోజా అన్నారు ఈ ఇద్దరు నేతలు పెద్ద పారిశ్రామికవేత్తలని... వీరే రాష్ట్రానికి మంచి పారిశ్రామిక ఇండస్ట్రిలతో పాటు పారిశ్రామిక పాలసీలను తీసుకు వస్తారని ఆమె అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆమె పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
ఏపీఐఐసీ చైర్మన్ హోదాలో ఈ సదస్సుకు హాజరైన రోజా మాట్లాడుతూ ‘‘ నిర్ణీత సమయంలో పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇస్తాం. పైసా లంచము ఇవ్వకుండా అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. రాష్టంలో 300 ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 33 పారిశ్రామిక పార్కులను అభివృద్ది చేశాం. స్థానికుల ఉద్యోగాల విషయమై ప్రతి చోట ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై పారిశ్రామిక వేత్తలు స్పందించాలి ’’ అని అన్నారు.
ఈ నేపథ్యంలోనే రోజా గత ఐదేళ్ల టీడీపీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు ఒక్కో పరిశ్రమకు ఒక్కో రకమైన పాలసీ ఇచ్చి రాష్ట ఖజానాకు గండి కొట్టారని రోజా ఆరోపించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకుండానే ఎన్నో పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ వాళ్లు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు.
పరిశ్రమలకి గత ప్రభుత్వం అధిక రాయితీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రతి మూడు నెలలకి ఓసారి పారిశ్రామికవేత్తలని కలిసి సమస్యలు తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక నైపుణ్యం కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకువస్తామని రోజా అన్నారు. ఏదేమైనా కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్గా రోజా ఏపీలో పారిశ్రామిక సంస్థల ఏర్పాటులో దూకుడుగానే ముందుకు వెళుతున్నారు.