2014 సార్వత్రిక ఎన్నికల తరువాత మోడీకి ఎంత పేరు వచ్చిందో.. తెరవెనుక నుంచి మోడీ పరపతిని పెంచడానికి, బీజేపీని దేశంలో సుస్థిరం చేయడానికి కృషి చేసిన ఐప్యాక్ చైర్మన్ ప్రశాంత్ కిషోర్ కు అంతే పేరు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రశాంత్ కిషోర్ బీహార్ నితీష్ పార్టీ తరపున ప్రచారం చేశారు. అక్కడ మంచి ఫలితాలు సాధించారు. పార్టీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రశాంత్ కిషోర్ కు డబ్బుతో పాటు పార్టీ గౌరవ ఉపాధ్యక్ష పదవిని కూడా ఇచ్చాడు నితీష్ కుమార్.
ఆ తరువాత ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. కానీ, విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. సౌత్ లో వైకాపాకు పనిచేసి విజయం సాధించాడు. ఎవరూ ఊహించని విధంగా వైకాపా 151 స్థానాల్లో విజయం సాధించింది. ప్రజలు నాడిని తెలుసుకొని, దానికి తగిన విధంగా ప్రచార కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ తరువాత అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ కు ఒప్పందం కుదిరింది. ఆ పార్టీ తరపున పనిచేస్తున్నారు. అలానే మహారాష్ట్రలో శివసేన పార్టీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈసారి శివసేన సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధం అయ్యింది. ఆదిత్య థాకరే ను ముఖ్యమంత్రిగా చేయాలనీ ఉద్దవ్ థాకరే చూస్తున్నారు. అందుకే ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇప్పుడు సౌత్ లో మరో పార్టీతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ సిద్ధం అయ్యాడు. తమిళనాడుకు మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో సౌత్ నుంచి కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యాం పార్టీ పోటీ చేసింది. పోటీ చేసినా పెద్దగా కలిసిరాలేదు. కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. అది పట్టణాల్లో మాత్రమే. ఈసారి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని సిద్ధం చేస్తోంది. పట్టణాలతో పాటు గ్రామ స్థాయిలో కూడా కమల్ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రశాంత్ కిషోర్ కమల్ హాసన్ తో చర్చలు జరుపుతున్నారు.