జైలుకు వెళ్లాడంటే ఎవరికైనా భయమే. జైలు అంటే బందిఖానా.. అందులో ఇరుక్కున్నాక స్వేచ్ఛ ఉండదు. ఇనుప సంకెళ్ళ మధ్య.. ఊసలు మధ్య ఊగిసలాడాలి. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా.. అక్కడి నుంచి బయటకు వెళ్లిపోదామా అని చూస్తుంటారు. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా సరే.. తప్పించుకు పోతుంటారు. అలా వెళ్లడం తప్పని తెలిసినా సరే.. బయటకు వెళ్ళాలి అంటే తపన ముందు అవేమి గుర్తుకు రావు.
అయితే, ఇండోనేషియా నగరంలోని సోరంగ్ నగరంలో జరిగిన సంఘటన ప్రతిఒక్కరిని షాక్ కు గురిచేసింది. జైలు లోనుంచి తప్పించుకుని పోయే అవకాశం అక్కడి ఖైదీలకు వచ్చింది. ఛాన్స్ దొరికితే పారిపోవచ్చు. దొరక్కుండా తప్పించుకు తిరగొచ్చు. ఎక్కడో ఒకచోట హాయిగా బ్రతకొచ్చు. కానీ, సోరంగ్ నగరంలోని జైలులో ఉన్న ఖైదీలు మాత్రం అలా చేయలేదు. వారు చేసిన ఆ పని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేపర్లో, టీవీల్లో వారి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇండోనేషియాలోని పపువా విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్ కు నిరసనగా విద్యార్థులు రెచ్చిపోయి అల్లర్లు చేశారు. సోరంగ్ జైలుకు నిప్పు అంటించారు. ఆ జైలులో 500 ఖైదీలు ఉన్నారు. అందులో చాలా మందికి లైఫ్ పడింది. జైలు కాలిపోవడంతో అందులోని ఖైదీలు చాలామంది బయటకు వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారు తిరిగి జైలుకు వచ్చారు.
రావడమే కాదు.. జైలు పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం జైలు నిర్మాణంలో వారు కూడా సహకారం అందిస్తున్నారు. జైలు ఖైదీలు చేసిన పనిని ఇండోనేషియా ప్రభుత్వం ప్రశంసించింది. జైలులో ఉండే ఖైదీల ప్రవర్తనను మెచ్చుకుంది. ఒకవేళ పారిపోయిన 270 మంది ఖైదీలు తిరిగి రాకుంటే వారిని పోలీసులు వెతికి పట్టుకునే వారు. దీంతో శిక్ష మరింత రెట్టింపు అవుతుంది. ఇదంతా గ్రహించిన ఖైదీలు తిరిగి రావడం విశేషం. పైగా ఆ జైలులో ఖైదీలను చాలా బాగా చూసుకుంటారట. అందుకే తిరిగి వచ్చినట్టు ఖైదీలు చెప్తున్నారు.