ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యక్తిగతంగా దుర్వార్త. బీజేపీకి తీవ్రమైన నష్టం. ఇటీవలే మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. కేవలం 18 రోజుల తేడాతో బీజేపీ మరో అగ్రనేతను కోల్పోయింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన వయసు 66 ఏళ్లు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న జైట్లీ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ అధికారిక ప్రకటన వెలువరించింది.
మూత్రపిండాల సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఆగస్టు 9వ తేదీన జైట్లీని ఆయన కుటుంబసభ్యులు ఎయిమ్స్లో చేర్చారు. ఆ రోజునే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాస్పిటల్కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, దాదాపు 15 రోజుల పాటు ఆయన ఎయిమ్స్లో చికిత్స పొంది శనివారం కన్నుమూశారు. జైట్లీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మోదీ కాబినెట్లో కీలకమైన నాయకుడు, న్యాయవాది, ట్రబుల్ షూటర్గా అరుణ్ జైట్లీకే పేరుంది. ఎన్నికల సమయంలో చమురు ధరలు పెరగడంతో, 2018 చివరి నాటికి వృద్ధిరేటు 6.6 శాతానికి పడిపోయింది. ఇంకా గ్రామీణ వినియోగ డిమాండ్ తగ్గుముఖం పట్టడం, పెరుగుతున్న ఇంధన ధరలు ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారాయనే విమర్శలను జైట్లీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉండటంతో పీయూష్ గోయల్ ఆయన స్ధానంలో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున తాను ప్రభుత్వంలో, క్యాబినెట్లో ఎలాంటి బాధ్యత నిర్వహించలేనని అరుణ్ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు.