యువరత్న నందమూరి బాలకృష్ణ ఇద్దరు కుమార్తెల వివాహాలు జరిగాయి. బ్రాహ్మణికి లోకేష్ భర్త కాగా... రెండో కుమార్తె తేజస్వినికి గీతం సంస్థల చైర్మన్ శ్రీభరత్కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో విశాఖ ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసిన భరత్ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు ఇప్పుడే తిరిగి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న శ్రీభరత్ తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బాలకృష్ణ అంకుల్ ఇద్దరు కూతుర్లు బాగుంటారని... ఇంకా చెప్పాలంటే ఈ ఇద్దరికీ హీరోయిన్లు అయ్యే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నారు. ముందు నుంచి ఆ కుటుంబంలో మహిళలు కళారంగంవైపు రాలేదు. నిజానికి నా భార్య తేజశ్విని హీరోయిన్ అయితే చూడాలనుకున్నాను. ఇప్పటికీ ఆమెకు ఆ స్వేచ్ఛ ఇస్తానని కూడా షాకింగ్గా మాట్లాడాడు.
బ్రాహ్మణి ఎప్పుడూ బిజినెస్, ఇతరత్రా వ్యవహారాల్లో బిజీగా ఉంటుందని... కానీ తన భార్య తేజస్విని అలా కాదని... ఆమెలో కళాహృదయం కూడా ఉంది. అప్పుడప్పుడు భలేగా నటిస్తుందన్నాడు. నువ్వు హీరోయిన్ అయితే బాగుంటుందని కూడా తాను చెప్పినట్టు భరత్ తెలిపాడు. అయితే ఆమె హీరోయిన్ కాకపోయినా... ఇండస్ట్రీలోకి అయితే వస్తుందని... బహుశా ఆమె ఏ ప్రొడక్షన్ ఫీల్డ్లో అయినా ఎంట్రీ ఇవ్వవచ్చని... తాను మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పనని కూడా చెప్పాడు.
ఇక మామ బాలయ్య గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ దర్శకుడు కూడా బాలయ్యలోని అసలైన కోణం చూపించలేదని చెప్పాడు. తెరవెనక బాలయ్యలో చాలా ఫన్ అంటుందని, ఇంకెంతో ఆధ్యాత్మికత కూడా ఉందని.. ఆ రెండు కోణాల్ని ఆవిష్కరించే దర్శకుడు ఇంతవరకు రాలేదంటారాయన. ఏదేమైనా బాలయ్య ఫ్యామిలీ గురించి ఇప్పటి వరకు తెలియని విషయాలు ఈ ఇంటర్వ్యూలో భరత్ చెప్పుకొచ్చాడు.