చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రధాని నరేంద్రమోడీ ఉద్వేగానికి లోనయ్యారు. జాబిలమ్మకు అడుగుదూరంలోనే ఆగిపోయామని, అయినా అధైర్యపడొద్దని, దేశం మొత్తం మీవెంటే ఉందంటూ ఇస్త్రో శాస్త్రవేత్తలకు మోడీ ధైర్యం చెప్పిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుమారు రాత్రి రెండు గంటల వరకు ఇస్త్రో శాస్త్రవేత్తలతోనే ఉన్న మోడీ.. వారి ధైర్యం చెప్పి మరీ భుజం తట్టారు. మిమ్మల్ని చూసి యావత్ దేశం గర్విస్తోందన్నారు. దేశ ప్రజల కలను సాకారం చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారని.. మీరెంత కష్టపడ్డారో మీ కళ్లే చెబుతున్నాయని, మీకు యావత్ దేశం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతమాత తలెత్తుకునే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారని ప్రధాని అభినందించారు.
చంద్రయాన్-2 ల్యాండింగ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన మోడీ.. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తెగిపోవడంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత.. బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్వర్క్లో (ఇస్ట్రాక్)లో చంద్రయాన్-2 ప్రయోగంపై శనివారం ఉదయం జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. తొలుత ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు. మీ కృషిని యావత్ దేశం అర్థం చేసుకోగలదు. మీ కష్టం దేశానికి తెలుసు. భారతమత తలెత్తుకునేలా ప్రయోగం కోసం జీవితాన్ని ధారపోశారు.. అంటూ మోడీ ధైర్యం చెప్పారు.
' మీ కృషి ఎప్పటికీ వృథా కాదు. శాస్త్రవేత్తల కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తున్నా. దీనిలో వారి త్యాగం ఎంతో ఉంది. మనకు ఎదురైన అడ్డంకులే మన మనోబలాన్ని మరింత బలోపేతం చేస్తాయి. జయాపజయాలను ధైర్యంగా స్వీకరించాలి. అడుగుదూరంలో ఆగిపోవడం ఏమాత్రమూ అపజయం కానేకాదు.. మీరు చూపిన తెగువ మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికి నిర్ధేశం చేసింది. మీ కృషికి ప్రతిఫలంగా దేశమంతా మీకు అండగా నిలబడుతోంది. ప్రపంచ దేశాల్లో భారత్ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. ముందుముందు మనం మరిన్ని లక్ష్యాలను మనం సాధించాల్సి ఉంది. దానికోసం మరికొన్ని అంతరిక్ష ప్రయోగాలను మనం చేపట్టాలి. ఎన్నో ఆటంకాలను విజయవంతగా అధిరోహించిన చరిత్ర ఇస్రోకు ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తారనే నమ్మకం నాతోపాటు ఈ దేశ ప్రజలకూ ఉంది ' అంటూ మోడీ భావోద్వేగానికి లోనయ్యారు.