వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. చెట్టూపుట్టా కలిసి తిరిగారు. పెళ్లి గురించి ఏమి ఆలోచించుకున్నారో ఏమో కానీ.. ఈ లోపు వయస్సు తొందర వారిని ఊరికే ఉండనివ్వలేదు.. ఇద్దరూ ఒక్కటయ్యారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. అసలే చదువుకునే వయస్సు.. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదువు కూడా పూర్తి కాలేదు.. ఇంతలోనే ఈ పిడుగు లాంటి వార్త..


ఏం చేయాలి.. ఇంట్లో చెప్పలేరు.. అలాగని దాచుకునేది కాదు. అందుకే ఆమె అబ్బాయిని ఆశ్రయించింది. అతడు ఆమె గర్భం తొలగించేందుకు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు.. అంతా సవ్యంగా ఉంటే ఏమయ్యేదో ఏమో కానీ.. అక్కడ వైద్యం వికటించింది. అబార్షన్ సమయంలో తేడా వచ్చింది. ఏకంగా ఆ యువతి ప్రాణాలే కోల్పోయింది. ఇదీ కర్ణాటక రాష్ట్ర కలబుర్గికి చెందిన శిభ అనే 22 ఏళ్ల అమ్మాయి కథ.


అనుకోని ఈ పరిణామంతో ఆమె ప్రియుడికి ఏం చేయాలో తోచలేదు. అర్జంటుగా మృతదేహం మాయం చేయాలి.. అందుకే.. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ప్రేమికుడు తన స్నేహితుని సహకారం తీసుకున్నాడు. ఈనెల 4వతేదీన అమ్మాయి డెడ్ బాడీని ఓ కారులో వేసుకుని తెలంగాణ వైపు బయలు దేరారు. వికారాబాద్ జిల్లా రంగంపల్లి శివారులోని బీజాపూర్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి దగ్గర్లో.. శిభ మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.


ఆ తర్వాత విషయం పోలీసులకు తెలిసింది. దీన్ని ఛాలెంజింగ్ తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వారి విచారణలో కర్ణాటకలోని కలబుర్గిలో అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదైందని తేలింది. విచారణ కొనసాగిస్తే.. ఆమె మృతదేహాన్ని తెచ్చిన దుప్పటి అసలు విషయం పట్టించింది..ఆ ఆసుపత్రిలో విచారణ చేస్తే.. విషయం బయటపడింది. ప్రియురాలి మృతదేహాన్ని గుల్బర్గా నుంచి కారులో సుమారు 140 కి.మీ ప్రయాణించి రంగంపల్లి వద్దకు తీసుకొచ్చాడని తేలింది. ఇప్పుడా కుర్రాడిని పట్టుకునేందుకు పోలీసులు కర్ణాటకలోకి గుల్బర్గా పోలీసుల సాయం తీసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: