సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత జరిమానాలు భారీగా విధిస్తున్నారు. ఈ జరిమానాలు విధింపుతో పాపం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ చట్టాన్ని త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంపోజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా అవగాహన కల్పించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధం అయ్యింది.
హైదరాబాద్లో మొదట మూడు నాలుగు రోజుపాటు అవగాహన కల్పించాలని పోలీస్ యంత్రాంగం అనుకుంది. మొదట డ్రైవింగ్ లైసెన్స్ పై దృష్టి పెట్టింది. మైనర్లు డ్రైవింగ్ చేస్తే తగిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే.. ఐదు వేలు ఫైన్ తో పాటు తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారట. ఒకసారి పట్టుబడితే జరిమాణతోనే సరిపోతుంది. రెండోసారి అదే విధంగా పట్టుబడితే... జైలుకు పంపడం ఖాయం అని అంటున్నారు.
ఇది మైనర్ల విషయంలో మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి విషయంలో కూడా దీన్ని అమలు చేయబోతున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5వేలు జరిమానా.. వేస్తారు. అక్కడికక్కడే వాహనం తీసుకుంటారు. డ్రైవింగ్ లైసెన్స్ కు అప్లై చేసిన తరువాత తిరిగి వాహనాన్ని అప్పగిస్తారు. అప్పటి వరకు పోలీసుల వద్దనే వాహనం ఉంటుంది. వినాయక చవితి తరువాత ఈ చట్టాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నది పోలీస్ వ్యవస్థ.
ఇప్పటి వరకు దేశంలోని 16 రాష్ట్రాలు కొత్త వాహన చట్టాన్ని అమలు చేస్తున్నాయి. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం ఇంకా అమలులోకి రాకపోవడం విశేషం. ఈ చట్టం ప్రకారం విధిస్తున్న జరిమానాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జరిమానాలు కట్టేకంటే.. వాహనాన్ని ఇంట్లో ఉంచి బస్సుల్లో వెళ్లడం ఉత్తమం అని కొందరు భావిస్తున్నారు. అయితే, చట్టాలను గౌరవించాలని, అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడు భయపడటం ఎందుకని కొందరి వాదన. ఇప్పటి వరకు చట్టాలను అమలు చేయకపోవడం వలనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇకపైన చట్టాలను కొంతకాలం పాటు కఠినంగా అమలుచేస్తే.. అన్ని దారిలోకి వస్తాయన్నది ప్రభుత్వం ఆలోచన. దీనిని చాలామంది నెటిజన్లు సపోర్టు చేస్తున్నారు కూడా.