పబ్జీ ఆన్లైన్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఓ వ్యసనంగా మారింది. ఈ గేమ్ వల్ల ఎంతో మంది జీవితాలు చిత్తు చేసుకుంటున్నారు. కొంతమంది యువత కంటిన్యూగా గేమ్కు బానిసలు కావడంతో చివరకు వారి జీవితాలు కూడా నాశనమవుతున్నాయి. ఇక ఈ గేమ్ వల్ల కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కొందరు విద్యార్తులు పదే పదే గేమ్ ఆడుతూ గుండెపోటుతో పాటు ఇతరత్రా వ్యాధులకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
ఇక రెండు రోజుల క్రితం యూపీకి చెందిన ఓ యువకుడు పదే పదే గేమ్ ఆడడంతో తండ్రి మందలించాడు. అయినా ఆ యువకుడు తలుపులు వేసుకుని గేమ్ ఆడడంతో కోపం వచ్చిన తండ్రి ఫోన్ లాగేసుకున్నాడు. చివరకు సహనం కోల్పోయిన యువకుడు పక్కనే ఉన్న రాడ్తో కొట్టడంతో తండ్రి చనిపోయాడు. చివరకు ఆ తండ్రి శవం పక్కనే రాత్రంతా గేమ్ ఆడాడు. చివరకు ఉదయం స్థానికులు జరిగిన దారుణం గుర్తించారు.
ఇక తాజాగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పబ్ జీ మర్డర్లు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ సారి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. విశాఖపట్నం సిటీలోని స్థానిక చినకోరాడ ప్రాంతంలో నివాసముంటున్న బోయి వెంకటరమణ, త్రివేణి దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బోయి లోహిత్ (14) స్థానికంగా ఓ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు.
పబ్జీ గేమ్కు బానిసైన లోహిత్ చదువును నిర్లక్ష్యం చేస్తుండడంతో తల్లి త్రివేణి గత నెల 20న మందలించి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుంది. తల్లి ఫోన్ లాగేసుకోవడంతో మనస్థాపానికి గురైన లోహిత్ చీమల మందు నీటిలో కలుపుకుని తాగేశాడు. పరిస్థితి విషమించడంతో రెండు, మూడు ఆసుపత్రులు మార్చినా చివరకు కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలుడు మృతిచెందాడు. ఏదేమైనా పబ్జీ ఎఫెక్ట్ వల్ల ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరం.