ఆగష్టు 5 తరువాత జమ్మూ కాశ్మీర్ లో నిశ్శబ్దం తాండవించింది. చాలా రోజుల వరకు ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడ్డారు. ఇప్పటికి ఇంకా భయపడుతూనే ఉన్నారు. జమ్మూలో పరిస్థితులు మెరుగుపడగా.. కాశ్మీర్లో మాత్రం ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు మినహా.. మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కాశ్మీర్ పరిస్థితి. అక్కడి వాతావరణం.. అక్కడి పరిస్థితులు వేరు.
ఇదే విధమైన వాతారణం ఇప్పుడు పాలనాడులో కొనసాగుతున్నది. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారనే నెపంతో కొంతమంది వ్యక్తులపై దాడులు చేయడం... వారంతా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన శిబిరాల్లో చేరిపోవడం.. శిబిరాల్లో తలదాచుకున్న వ్యక్తులతో కలిసి బాబు ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో రభస మొదలైంది. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఏ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు.
మరోవైపు నాయకులను ఎక్కడికక్కడే అరెస్టులు చేశారు. గృహనిర్బంధం విధించారు. దీంతో నేతలు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. మేమేమి జమ్మూ కాష్మర్ లో లేమని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామని, ఇలా హౌస్ అరెస్టులు చేయడం ఏంటని వాపోతున్నారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టడం లేదు. అరెస్ట్ చేసి ఇంటికే అంకితం చేస్తున్నారు. పలనాడు ప్రాంతంలో 144 సెక్షన్ విధించడంతో బయట వ్యక్తులు ఎవరూ తిరగడంలేదు.
ఎక్కడ చూసినా సైరన్ మోతలు.. పోలీసుల పహారాలో పలనాడు ప్రాంతం కనిపిస్తోంది. ఎప్పుడు లేని విధంగా పలనాడు ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో.. సామాన్యజనం ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వస్తే ఏమౌతుందో అని బెదిరిపోతున్నారు. బయటకు వచ్చేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు ప్రజలు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఈ 144 సెక్షన్ ఎత్తివేయాలని అంటున్నారు ప్రజలు.