భారత్ తర్వాతి టార్గెట్ పాకిస్థాన్కు మైండ్ బ్లాంక్ చేసేలా ఉండనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)కు పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల మాట్లాడుతూ...పాక్ నుంచి పీవోకేను స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. దీనిపై రావత్ స్పందిస్తూ.... ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు. POKను పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకుని భారత్ లో అంతర్భాగం చేయడమే మా తదుపరి అజెండా అని చెప్పారు రావత్. ఇలాంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే దేశంలోని వ్యవస్థలు నడుచుకుంటాయన్నారు. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేసేందుకు ఆర్మీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు.
పీవోకే అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా వినిపించారు. అయితే ఆ ప్రాంత ప్రజలు శాంతిని నెలకొల్పేందుకు ఆర్మీకి సహకరించాలని బిపిన్ రావత్ అన్నారు. అనేక ఏళ్లుగా ఉగ్రవాదానికి కశ్మీర్ ప్రజలు బలయ్యారని, ఇప్పుడు అక్కడి ప్రజలు శాంతిని నెలకొల్పేందుకు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని రావత్ తెలిపారు. పీవోకే ప్రాంతాలను భారత్లో కలుపాలన్న తీర్మానాన్ని 1994లో పార్లమెంట్ ఆమోదించిందని, ఇది అప్పటి ప్రధాని నర్సింహారావు నేతృత్వంలో జరిగిందని ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్ర అన్నారు. కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం గురించి మాత్రమే పాక్తో చర్చలు చేస్తామని కూడా ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ మీడియాకు తెలిపారు. భారత్ ప్రకటన సహజంగానే పాక్లో కలవరపాటుకు కారణం అవుతోంది.