చిత్తూరు జిల్లాలోని మామడుగు ప్రాంతం సమీపంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు బోల్తా పడిన వెంటనే కారు నుండి మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. కారులోని ప్రయాణికులలో ఐదుగురు ప్రయాణికులు ప్రమాద స్థలంలోనే సజీవ దహనమయ్యారు. ఒక్క ప్రయాణికుడు తీవ్ర గాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డాడు. 
 
తిరుపతి నుండి బెంగళూరు వైపు వెళుతున్న కారుకు ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారందరూ తిరుపతికి చెందిన వారని సమాచారం. గాయపడిన వ్యక్తి పేరు విష్ణు అని తెలుస్తోంది. విష్ణును వైద్య చికిత్స కోసం పలమనేరు ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే గంగవరం పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి కేసు నమోదు చేశారు. 
 
కారు వేగంగా రావటం వలనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటన గురించి స్థానికులను విచారిస్తున్నారు. పోలీసుల నుండి అందిన వివరాల ప్రకారం విష్ణు అనే వ్యక్తి తిరుపతిలోని టీఎంసీ సిగ్నల్ ప్రాంతంలో నివాసం ఉంటాడు. విష్ణు చెల్లెలు కళ బెంగళూరులో నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితం విష్ణు చెల్లెలు కళ మరియు కళ కుమారుడు భాను తేజ విష్ణు ఇంటికి వచ్చారు. 
 
కళ, భాను తేజను బెంగళూరులో వదిలేందుకు విష్ణు అతని భార్య జాహ్నవి, కుమార్తె సాయి అశ్విత, కుమారుడు పవన్ రాం కారులో బయలుదేరారు. గంగవరం మండలం మామడుగు సమీపానికి చేరుకోగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది . తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విష్ణు మాత్రం బయటపడగా మిగిలిన వారంతా సజీవ దహనమయ్యారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: