కశ్మీర్కు ప్రత్యేక హక్కుల కల్పించే ఆర్టికల్ 370ను భారత్ రద్దుచేసిన నాటి నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా అలాంటి ఉత్తర ప్రగల్భాలే పలికారు. ఆల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ భారత్, పాక్ యుద్ధంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధమే గనుక సంభవిస్తే భారత్ సామర్థ్యం ముందు తాము ఏమాత్రం నిలవలేమని పరోక్షంగా ఓటమిని అంగీకరించారు. సాంప్రదాయ యుద్ధమే గనక వస్తే పాకిస్థాన్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ, సాధారణ యుద్ధంలో ఓడిపోయినా అణుయుద్ధాన్ని మాత్రం కొట్టిపారేయాలేమని వ్యాఖ్యానించారు.
‘సాంప్రదాయ యుద్ధంలో పాకిస్థాన్ ఓడిపోవచ్చు.ఈ సమయంలో తమకు రెండు మార్గాలు ఉంటాయి ఓటమిని అంగీకరించి లొంగిపోవడం లేదా చివరి రక్తపుబొట్టు వరకు స్వాతంత్రం కోసం పోరాడటం రెండోదే తాము ఎంచుకుంటాం. రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే అది అణ్వస్త్రాలతోనే ముగుస్తుందని, దాని పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.. అయితే, తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, దీనికి పూర్తిగా వ్యతిరేకమని’ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
అణు యుద్ధంపై పాక్ ప్రధాని గతంలోనూ పలుమార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకపోతే రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు పునరావృతమవుతాయని హెచ్చరించే ప్రయత్నం చేశారు. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ కశ్మీర్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే కోట్లాది మంది ముస్లింలు తీవ్రవాదం వైపు మళ్లి, భారత్కు వ్యతిరేకంగా పోరాటం చేసే అవకాశం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమాజం పరిష్కరించకపోతే ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు.
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన పాకిస్థాన్ని ఒడ్డునపడేస్తానని, భారత్తో సత్సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తానని ఎన్నికల సమయంలో ఇమ్రాన్ హామీ ఇచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కశ్మీర్ అంశాన్ని సాకుగా చూపి పాక్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. మరోవైపు, కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ మద్దతు కొరవడిందని బహిరంగంగానే ఆయన అంగీకరించారు.