ఇంతకాలం గులాబీ దళానికి కేవలం కాంగ్రెస్ నుంచే ప్రమాదం ఉండేది.. అయితే కాంగ్రెస్ నాయకత్వాన్ని దెబ్బతీసిన గులాబీ దళపతి కమల వికాసంను ముందుగా పనిగట్టలేక పోయాడు.. కమలాన్ని కేవలం అర్భన్ పార్టీగానే గుర్తించిన గులాబీ దళానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పటికి దాన్ని చావుదెబ్బ తీసిని గులాబీ పార్టీ, కమలంకు ఒకే సీటు రావడంతో బేఫీకర్ అంటూ నిర్లక్ష్యం చేసింది.. కానీ కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన స్ట్రోక్కు గులాబీ దళపతికి కళ్ళు బైర్లు కమ్మాయి.. పార్లమెంట్ ఎన్నికల్లో కమలం వికసించి గులాబీకి షాక్ ఇవ్వడంతో తేరుకున్న గులాబీ నేతకు వాస్తవమేంటో బోధ పడింది.
పార్లమెంట్ ఎన్నికల్లో రూరల్, అర్భన్ ప్రజలు కమలం పార్టీకి బ్రహ్మరథం పట్టి నాలుగు ఎంపీలను గెలిపించి కషాయం పార్టీలో కొత్త ఉత్సాహం నింపారు. ఇదే ఊపుతో ఇప్పుడు తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసుకునేందుకు పార్టీ అధిష్టానం దృష్టి సారింది. గులాబీ దళంలోని చిన్నా చితక నేతల నుంచి పార్లమెంట్ మెంబర్ల వరకు ఎవరిని వదలకుండా పార్టీలో చేర్చుకోవాలనే నిర్ణయానికి రావడమే కాకుండా కార్యాచరణ కూడా ప్రారంభించింది. దీంతో గుబులు చెందిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూడా గులాబీ పార్టీలోని అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో భాగంగా పదవులు పందేరం వేశాడు.
అయినా గులాబీ పార్టీలోని నియంతృత్వ పోకడలు నచ్చని నేతలంతా కషాయం పంచన చేరేందుకు సిద్దమయ్యారు. అయితే ఇప్పుడు కాషాయం పార్టీ నేతలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ అంటూ గులాబీ పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నేతలపై దృష్టి సారించింది.. గులాబీ పార్టీ నుంచి కషాయం పార్టీకి ఎవరెవరు వలస పోయేందుకు సిద్దంగా ఉన్నారో తెలుసుకునేందుకు గులాబీ పార్టీ దించిన ఐబీ శాఖ సమాచార సేకరణకు ఉపక్రమించింది. అయితే ఐబీ శాఖ నిద్రపోతున్నట్లు ఉంది.
అందుకే నిజమాబాద్ జిల్లాకు చెందిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో భేటి అయ్యారు. ఈ విషయాన్ని కనీసం ఐబీ అధికారులు గుర్తించలేకపోయారు. ఎంపీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేసేంత వరకు ఐబీ అధికారులు గులాబీ దళపతికి ఎలాంటి సమాచారం అందించలేదు.. గులాబీ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు అనేక మంది మాజీలు, తాజా నేతలు ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ కళ్ళుగప్పి బీజేపీ నేతలతో రహాస్యంగా కలిసి వచ్చారట.
అయితే వీరంతా తమ గన్మెన్ల తోడు లేకుండా పోయి తనపని చేసుకుని వచ్చారట.. దీంతో ఐబీ అధికారుల నిఘా కొరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా, ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గులాబీని విడిచి పోతున్నారో.. పసిగట్టాలంటూ గులాబీ బాస్ ఆదేశించారట.. అసలు కొసమెరుపు ఎంటంటే.. ఐబీ అధికారులు కూడా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ గులాబీ బాస్కు అసలు విషయాలు చేరవేయడం లేదట.. అంటే ఐబీ అధికారులను ఉపయోగించుకునే పనిలో బీజేపీ ముందుకు దూసుకుపోతుండటం, ఇప్పుడు గులాబీ బాస్కు మింగుడు పడటం లేదట.