బోటు ప్రమాదానికి గురైన దేవిపట్నం ప్రాంతంలో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పర్యటిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు  పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల నాని  కురసాల కన్నబాబు తెలిపారు. తొలుత బోటు ప్రమాదంలో గాయపడి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ...’ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ప్రమాదం నుంచి ఇప్పటివరకూ 20మంది సురక్షితంగా  బయటపడ్డారు.






ఇప్పటివరకూ ఎనిమిది మృతదేహాలు లభించాయి. క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి తరలించేందుకు ఏర్పాటు చేశాం. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బోటులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత లేదు. ఓఎన్‌జీసీ హెలికాఫ్టర్‌తో గాలింపు చర్యలు కొనసాగాయి. మృతుల కుటుంబాలకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తాం.’  అని మంత్రులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో బోటు మునక దుర్ఘటనలో 8మంది మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదం నుంచి 27మంది సురక్షితంగా బయటపడగా, సుమారు 25మంది ఆచూకీ లభించాల్సి ఉందని తెలిపింది.




బోట్ బోల్తా పడిన సంగత స్థలంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో పాటు ఆరు అగ్నిమాపక సిబ్బంది, నేవీ గజ ఈతగాళ్ల బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రెండు హెలికాఫ్టర్లు, 8 బోట్లు, ఆస్కా లైట్లు, ఇతర రెస్క్యూ పరికరాలతో రాత్రికి కూడా గాలింపు చర్యలు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా  సోమవారం ఉత్తరాఖండ్‌ నుంచి ప్రత్యేక బృందాలు సైడ్‌ స్కాన్‌ సోనార్‌తో మృతదేహాల గాలింపులో పాల్గొంటాయని విపత్తుల నిర్వహణ శాఖ  పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: