ఉచితంగా వస్తున్నాయి అంటే మనం దేన్నీ వదిలిపెట్టం... అలాంటిది ఉచితంగా ఇల్లు, కరెంట్, గ్యాస్, వాటర్ వంటివి దొరికితే వదిలిపెడతారా చెప్పండి. ఆ అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారు. నెలతిరిగే సరికి సంపాదించిన సంపాదనలో సగం ఇంటి అద్దెలు కట్టుకుంటూ సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కొంతమంది నాయకులు మాత్రం ఉచితంగా వచ్చే ఇంట్లో ఉంటూ... ఖాళీచేయకుండా ఉంటున్నారట.
ఆ ఇళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినడంలేదట. ఇలా ఖాళీ చేయకుండా ఆ ఇళ్లను అంటిపెట్టుకొని ఉన్నది ఎవరో కాదు. మాజీ ఎంపీలు. ప్రతి ఐదేళ్లకు దేశంలో ఎన్నికలు జరుగుతాయి. అలా ఎన్నికైన ఎంపీలకు దేశ రాజధానిలో ఉండేందుకు ఇళ్లను ఇస్తారు. ఐదేళ్లపాటు అక్కడ ఉండొచ్చు. ఒకవేళ తిరిగి ఎంపీలా ఎన్నికైతే అక్కడే ఉండొచ్చు. ఓడిపోతే మాత్రం ఇంటిని ఖాళీ చేయాలి. ఇది రూలు. 2014 ఎన్నికల్లో ఎంపికైన ఎంపీలకు రాజధానిలో ఇళ్లను కేటాయించారు.
కాగా, 2019 లో జరిగిన ఎన్నికల్లో కొంతమంది ఓడిపోయారు. అలా ఓడిపోయిన వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలరోజుల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలి. ఇప్పటికి వందరోజులు దాటింది. కానీ, 82 మంది మాజీ ఎంపీలు ఇల్లు ఖాళీ చేయడానికి ఇష్టపడం లేదు. అక్కడే ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం హెచ్చరించింది. ఒకవేళ ఇల్లు ఖాళీ చేయకుండా విద్యుత్ సరఫరా, నీరు, గ్యాస్ కట్ చేస్తామని చెప్పింది.
చెప్పినట్టుగానే కొన్నింటికి అలానే చేసింది. కానీ, అక్కడి నుంచి కదలడం లేదని తెలుస్తోంది. మొత్తం 200 మంది మాజీలు ఉండగా, ప్రభుతం హెచ్చరికతో దాదాపు 118 మంది ఖాళీ చేశారు. 82 మంది మాత్రం ఇప్పటి వరకు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్నారు. దీంతో అక్కడి నుంచి వాళ్ళను ఖాళీ చేయించాలని ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది. మరి ఈ ప్రయత్నం ఫలిస్తుందా.. ఈ 82 మంది ఎప్పుడు ఖాళీచేస్తారు .. చూడాలి. ఖాళీ చేయకుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..