తోట త్రిమూర్తులు తెలుగు దేశం పార్టీ నుంచి వెళ్లిపోతున్నాడటగా.. ఈ మాట చాలా కాలం నుంచి వినిపిస్తోంది. తోట త్రిమూర్తులు కూడా చాలాసార్లు దీన్ని ఖండిస్తూ వచ్చారు. కానీ ఆయన అడుగులు మాత్రం టీడీపీని వీడటం ఖాయమనే అందరిలోనూ ధీమా కలిగించాయి. ఇన్నాళ్లూ ఆయన ఏపార్టీలోకి వెళ్లారన్నదానిపైనే చర్చ జరిగింది.
తోట బీజేపీలోకి వెళ్తారా.. వైసీపీలోకి వెళ్తారా అన్నది నిన్నటి వరకూ సస్పెన్సుగా ఉండిపోయింది. ఇప్పుడు ఆ సస్పెన్స్ వీడింది. ఆయన వైసీపీలో చేరిపోయారు. టీడీపీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు.
రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నేతను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి వైయస్ జగన్తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు.
పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాపుల తరుపున మాట్లాడలేదని, ఆయన అభిప్రాయం మాత్రమే అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం.. టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్న సంగతి తెలిసిందే..
తాజాగా తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం, వైఎస్సార్సీపీలో చేరడం జిల్లాలో టీడీపీని ఓ కుదుపు కుదిపేసింది. చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు గుడ్బై చెప్పేస్తున్నారు.