ఈ సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి పూంఛ్ సెక్టార్లో శనివారం ఉదయం భారత ఆర్మీ స్థావరాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ కాల్పులకు పాల్పడింది.
మోర్టార్ షెల్స్, తేలికపాటి ఆయుధాలతో భారత పోస్టులపై తూటాల వర్షం కురిపించింది. బాలాకోట్, మాన్కోట్, మెందర్ సెక్టార్లలోని పలు గ్రామాలపై కాల్పులకు తెగబడింది. భారీ శబ్దాలకు బాలాకోట్ పాఠశాలలో ఉన్న 20 మంది విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పాఠశాలలో చిక్కుకున్న చిన్నారులను రక్షించడానికి భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగింది.తమ ప్రాణాలను లెక్కచేయకుండా విద్యార్థులను మైన్ ప్రూఫ్ వాహనంలోకి ఎక్కించి, వారిని ఇళ్ల వద్ద సురక్షితంగా దింపారు.
పాక్ సైన్యం దుశ్చర్యను భారత బలగాలు సమర్ధంగా తిప్పికొట్టడంతో దాయాది తోకముడిచింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోను ఆదిత్య రాజ్ కౌల్ అనే సీనియర్ జర్నలిస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మరోవైపు, సెప్టెంబరు 10-11 తేదీల్లో హజీపూర్, కెరాన్ సెక్టార్లో పాక్ కాల్పులకు తెగబడగా ఆర్మీ ఎదురుదాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ రేంజర్లు హతమయ్యారు. తోక జాడించిన పాక్కు సైన్యం తగురీతిలో బుద్ధిచెప్పడంతో తెల్లజెండాను చూపిస్తూ వచ్చిన పాక్ జవాన్లు తమ సైనికుల మృతదేహాలను తీసుళ్లారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యముగా వెలుగుచూసింది.