కోడెల శివప్రసాదరావు రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. 2014లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కోడెల శివప్రసాదరావు మొదటి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పనిచేస్తూ వచ్చేవారు. గత కొన్ని రోజులుగా కోడెల చుట్టూ అనేక కేసులు చుట్టుముట్టాయి.
ఈ కేసుల కారణంగా అయన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఈ ఒత్తిడితో ఇబ్బందులు పడ్డాడు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ వాడుకున్నారని ఆయనపై కేసులు బనాయించారు. గతంలో ఆయనపై కేసులున్నా కానీ పెద్దగా భయపడలేదు. సొంత కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు ఎదురుకావడం.. సొంత పార్టీ నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కోవడంతో అయన ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వినిపించాయి.
కోడెల ఆత్మహత్య విషయం ఈరోజు చేసింది కాదు. రెండు వారల క్రితమే కోడెల ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే, కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో కోడెల బయటపడ్డారు. కాగా, ఈ ఉదయం కోడెల మరోసారి అయన తన గదిలో బట్టలు ఆరేసుకునే తాడుతో ఉరేసుకున్నాడు. గదిలోకి వెళ్లిన తండ్రి ఎంతసేపటి బయటకు రాకపోవడంతో కిటికీలోనుంచి చూసిన కూతురు షాక్ అయ్యింది.
వెంటనే సిబ్బంది సహాయంతో తలుపును పగలగొట్టి హుటాహుటిన బసవతారకం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యం అయ్యింది. బ్రతికించేందుకు వైద్యులు ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అప్పటికే అయన మరణించారు. పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న కోడెల జీవితం ఇలా విషాదంగా ముగిసిపోతుందని ఎవరూ ఊహించలేదు. గతంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నా ధైర్యంగా నిలబడ్డారు. కానీ, ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. కాగా, కోడెల మృతిపట్ల తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిడుల కారణంగా అయన ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు.