రాష్ట్రంలో ఏది జరిగినా.. తనకు అనుకూలంగా మార్చుకోవడంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ను మించిన నాయకులు లేరని అంటారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనూహ్య రీతిలో మృతి చెందారు. ఆయన ఎందుకు మృతి చెందారు? ఆత్మహత్య చేసుకున్నారా.? గుండె పోటుకు గురయ్యారా? వంటివి ఇప్పికైతే సస్పెన్స్గానే ఉన్నాయి. పోస్టు మార్టమ్ రిపోర్టు వస్తేనే ఈ ప్రపంచానికి ఏం జరిగిందనేది తెలుస్తుంది.
అయితే, కోడెల విషయంలో సంయమనం పాటించాల్సిన టీడీపీ.. నాయకులు ఎక్కడా బ్యాలెన్స్ చేయలేక పోతున్నారు. ఒక పెద్ద నాయకుడు అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడి అనుకోని రీతిలో వెళ్లిపోతే.. ఈ విషయం పట్ల సమర్ధు లైన టీడీపీ అధినేత సహా ఆ పార్టీ నాయకులు ఎలా స్పందించాలి ? ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి ? అయితే, దీనికి విరుద్ధంగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. సాధారణంగా చేసే విమర్శలనే ఇప్పుడు కూడా చేస్తున్నారు.
ఈ కోడెల మృతిని కూడా వైసీపీతో సంబందం అంటగట్టి నాయకులు వ్యాఖ్యలు చేస్తుండడంతోపాటు వారి అనుకూల మీడియాలోనూ ప్రచారం చేయిస్తున్నారు. జగన్ సర్కార్ వేధింపుల వల్లే కోడెల మృతి చెందారట... మూడు నెలల వేధింపులకే కోడెల ఆత్మహత్య చేసుకుని ఉంటే ఇన్నేళ్లుగా వేధింపులు ఎదుర్కొన్న సీఎం జగన్ ఎన్నిసార్లు ఇలా చేసుకోవాలో బాబుకే తెలియాలి.
ఇక కోడెల జగన్ సర్కార్ వేధింపుల వల్లే చనిపోయారన్న టీడీపీ నేతల వ్యాఖ్యలుకానీ, టీడీపీ నేతల పసలేని విమర్శలు కానీ ఇప్పుడు పార్టీకి కానీ, పార్టీ అధినేతకు కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఎలాంటి ప్రయోజనాన్నీ అందించలేదు. పైగా ఇప్పుడు కోడెల గురించి నాలుగు మంచి మాటలు తలుచుకోవడాన్ని పక్కన పెట్టి. ఏం జరిగినా,.. దానిని వైసీపీకి అంటగట్టాలనే విధానాన్ని అందరూ తప్పుబడుతున్నారు. కోడెల మృతికి వైసీపీ కారణమని, కేసులు పెట్టి వేధించారని, అందుకే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు విశ్లేషకులకు సైతం వినేందుకు ఇబ్బంది కరంగానే ఉన్నాయని అంటున్నారు.