త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో పొత్తులు కీలకంగా మారాయి. అందుకే కాంగ్రెస్, ఎన్సీపీ (నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) నడుమ పొత్తు కుదిరింది. గత దశాబ్ధ కాలంకు పైగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే సారి పొత్తులకు కొంత సమయం ఎక్కువ తీసుకోవడంతో అసలు ఈ రెండు పార్టీల నడుమ పొత్తు ఉంటుందా.. ఉండదా అనే సందేహాలు నెలకొన్నాయి.
అయితే ఎట్టకేలకు పొత్తు ఉంటుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. మహారాష్ట్రలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 288. ఎన్సీపీ 125, కాంగ్రెస్ 125 స్థానాల్లో బరిలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 38 స్థానాల్లో చిన్న పార్టీలు పోటీలో ఉంటాయన్నారు. అయితే ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాల సంఖ్యను ప్రకటించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారో ఇరు పార్టీల నేతలు ఓ చోట కూర్చుని గెలుపు అవకాశాలు ఉన్న పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
అయితే మహారాష్ట్రలో ఇప్పటికే బీజేపీ, శివసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నారు. సీట్ల సర్ధుబాటుపై శివసేన, బీజేపీ నేతల నడుమ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పొత్తుల్లో ముందున్న బీజేపీ, శివసేన పార్టీలు, స్థానాల సంఖ్య ఖరారులో మాత్రం వెనుకబడి పోయారు.
ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 19న విడుదల చేసే అవకాశం ఉందట. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు బీజేపీ, శివసేన కూటమికి కీలకంగా మారాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మహారాష్ట్ర ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు.