ఏడు పదులకు పైబడిన టిడిపి సీనియర్ నేత, పల్నాడు కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలు  వెలిగిన ధృవతార డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందారన్న వార్త ప్రతి మనిషినీ దిగ్భ్రమకు గురిచేసింది. ఏ మనిషికయినా మరణం అనివార్యం. ఆయన సహజంగా మరణిస్తే అది వేరు. కానీ, వారసులు మిగిల్చిన అవమానకర భారం, అధికార పార్టీ రాజకీయ వ్యూహానికి చిక్కి ఆత్మహత్య చేసుకోవడమే బాధాకరం.
నర్సరావుపేట ఎమ్మెల్యే కాకముందు.. కోడెల గుంటూరు రోడ్‌లో లక్ష్మీ నర్సింగ్ హోం నిర్వహించేవారు. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడిగా పేరు. ఆ తర్వాత స్థానిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కోడెల ఫుల్‌టైమ్ పొలిటీషియన్ అవతారమెత్తారు. నిజానికి కోడెల రాజకీయాల్లోకి వచ్చి.. పల్నాడులో బలమైన పునాది ఉన్న కాసు కుటుంబాన్ని ఓడించిన చాలాకాలం వరకూ వైద్య వృత్తిని విడిచిపెట్టలేదు. 


 కోడెలకు ఫిర్యాదులు (పితూరీలు) వినడం బాగా ఇష్టంగా ఉండేది.  ఆ అలవాటే ఆయనకు అత్యంత నమ్మకస్తులైన పేరిరెడ్డి, డాక్టర్ కొండపల్లిని ఆయన నుంచి వెళ్లేలా చేసింది. వారిద్దరే కాదు.. చాలామంది సీనియర్లను కోడెల అలాగే దూరం చేసుకున్నారన్నది బహిరంగమే.
ఓసారి కోటప్పకొండకు వెళుతుండగా అనుకుంటా. ఆయనను హత్య చేసేందుకు ఓ కల్వర్టు కింద పీపుల్స్‌వార్ (అప్పట్లో ఇంకా అది మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందలేదు) నక్సలైట్లు బాంబులు పెట్టారన్న వార్త సంచలనం సృష్టించింది. దానితో ఆయనకు భద్రత పెంచారు. అంజూరి రాధా అప్పట్లో డిఎస్పీగా ఉన్నట్లు గుర్తు. ఓసారి ఆసుపత్రిలో ఓ విలేకరిపై జరిగిన దాడిలో కోడెల హస్తం ఉందని పెద్ద గొడవ జరిగింది. జర్నలిస్టు సంఘ నేతలు కూడా హడావిడి చేశారు. 
 
ఆయన స్పీకర్ అయిప్పటి ముందు నాటి ఎన్నికల వరకూ నాయకత్వం నుంచి ఎన్నికల నిధులు తీసుకునేవారు కాదు. అలా టిడిపిలో నలుగురైదుగురు ఉండేవారు. స్వదేశం, విదేశాల్లో ఉన్న ఆయన మిత్రులు, సొంత కులానికి చెందిన పారిశ్రామికవేత్తలు చందాలు ఇచ్చేవారు. ఆయన సహజంగా చాలా పొదుపరి. అట్టే డబ్బు పెద్దగా ఖర్చు పెట్టేవారు కాద‌ట‌.


ఎన్టీఆర్, బాబు నాయకత్వంలో బాగా దూకుడుగా పనిచేసిన వ్యక్తి కోడెల.   ఆయనలో పిరికితనం ఎప్పుడూ చూడలేదు. చావుకు భయపడే నైజం ఆయనలో ఏనాడూ కనిపించదు. సీమ తర్వాత ఆ స్థాయి ఫ్యాక్షన్‌కు పెట్టింది పేరైన పల్నాడులో పట్టున్న ‘కాసు’ కోటకు బీటలు వారేలా పనిచేసిన ఆయన నిత్యం కాంగ్రెస్‌తో పోరాడేవారు. రాజకీయ ఎత్తు పై ఎత్తులు వేయడంలో నిష్ణాతుడు. తన సమర్థతను నాయకత్వానికి ఎప్పటికప్పుడు పలు రూపాలు, సంఘటనల ద్వారా నిరూపించుకున్నారు. అది ఎలాగో తెలుసాయనకు. ఒక సందర్భంలో నాయకత్వం తనకు ప్రాధాన్యం తగ్గించినా, కొంతకాలం మౌనం వహించి తన పనితీరు ద్వారా మళ్లీ మెయిన్‌స్ట్రీమ్‌కు వచ్చారు.మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, యరపతినేని సహా చాలామంది ఆయన స్కూలు విద్యార్ధులే. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. అలాంటి కోడెల రాజకీయ జీవితంలో రెండు పర్యాయాల ఓటమి తర్వాత వచ్చిన సత్తెనపల్లి విజయం ఆయనలో ఆశ్చర్యకరమైన మార్పులు తెచ్చింది. చివరకు అదే ఆయన పతనానికి కారణమయింది.
 
సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అత్యల్ప మెజారిటీతో అంబటి రాంబాబుపై గెలిచిన తర్వాత కోడెల తీరు, తెన్నూ పూర్తిగా మారిపోయాయి.  ఆ సమయంలోనే తనయుడు శివరాం మీద ఆరోపణలు రావడం ప్రారంభించాయి. సత్తెనపల్లి వద్ద రైల్వే లైను పనుల్లో కాంట్రాక్టరును శివరాం బెదిరించారన్న వార్త చివరకు పీఎంఓ వరకూ వెళ్లింది. అంతకుముందు నేరుగా కార్యకర్తలతో మాట్లాడే అలవాటున్న కోడెల.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత ‘పెదబాబును కలవండ’ని చెప్పడంతో ఆయన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠ పతనం మొదలయింది. తనయుడు ప్రతి దానికీ ఒక రేటు నిర్ణయిస్తారని, చేయి తడపనిదే పని చేయరన్న అప్రతిష్ట మూట కట్టుకున్నారు. చివరకు ఆ అపఖ్యాతి ఎంతవరకూ విస్తరించిందంటే అమెరికాలో జరిగే తానా, ఆటా సభల్లోనూ ఆయన తనయుడి వ్యవహారం చర్చలకొచ్చేది. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి పోగుచేసుకున్న కోడెల పరువు ఎంత వేగంగా దిగజారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.
 
నర్సరావుపేట-సత్తెనపల్లి నియోజకవర్గాలను కొడుకు-కూతురుకు అప్పగించడంతో కోడెల రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠ శరవేగంగా దిగజారి, చివరకు కోడెల ఆత్మహత్యకు పాల్పడే విషాదం వరకూ తీసుకువెళ్లడం బాధాకరం. వెంకట్ అనే ఆ కుర్రాడికొచ్చిన కష్టానికి ఏజెన్సీకి సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఆన్‌లైన్ టెండరు ద్వారా ఏజెన్సీ ఖరారయింది.  కానీ అధికారులేమో పెదబాబు చెబితేనే ఇస్తామంటారు. ఆ ప్రకారం గుంటూరులోని  షోరూముకు వెళ్లి గంటల తరబడి వేచి ఉన్న సదరు కుర్రాడి ని లెక్కచేయకుండా పెదబాబు  పంపించారట. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగాలిస్తామని, కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెప్పి.. అనేకమంది వద్ద లక్షల్లో వసూలు చేశారంటూ కొడుకు, కూతురిపై నమోదైన దాదాపు 26 కేసులు కోడెల రాజకీయ జీవితాన్ని వెక్కిరించినట్లు చేశాయి. ఫిర్యాదుదారులలో  సొంత పార్టీ వారే ఎక్కువగా ఉండటంతో కోడెల కష్టపడి పెంచుకున్న ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింది. కోడెల తొలుత తన కుమారుడిని హెచ్చరించిన సందర్భంలో.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా, అప్పటికే రోడ్డు ప్రమాదంలో ఓ కొడుకుని పొగొట్టుకున్న కోడెల.. చివరకు కొడుకును వదిలేశారన్న వార్తలు కూడా వ‌చ్చాయి.
 
 గతంలో కోడెలపై రాజకీయ ప్రత్యర్ధులు చిన్న విమర్శ చేస్తేనే మూకుమ్మడి ఎదురుదాడి చేసే ఆయన వర్గీయులు, సహచరులు ఆ సమయంలో మీడియా ముందుకొచ్చి ఖండించే సాహసం కూడా చేయలేకపోయారు. తన కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తోందని, వైఎస్ జమానాలో కూడా ఇలాంటి రాజకీయాలు తాను చూడలేదని చెప్పేవారు. ఇంటా బయట ఎదురవుతున్న అవమానాలు, తన వారసుల ‘స్థాయి తక్కువ పనుల’ నిర్వాకం, అధికార పార్టీ రాజకీయ వ్యూహాలకు ఉక్కిరిబిక్కిరయిన కోడెల తన జీవితాన్ని తానే ముగించుకోవలసి రావడం విషాదం, అత్యంత బాధాకరం!
  కోడెల జీవితం ఈవిధంగా విషాదాంతం కావడానికి దారితీసిన పరిస్థితులు నేటి చివరి తరం నేతలయిన తండ్రులకు ఓ హెచ్చరిక. కొడుకులు, కూతుళ్లను తాము జీవించి ఉండగానే ఉన్నత పదవుల్లో చూడాలన్న ఆశను.. వారసులు చిదిమేసి, చివరకు తండ్రులనే బందీలను చేసినందుకు వేదన అనుభవంచి, ఆత్మహత్యలకు పాల్పడే దౌర్భాగ్యానికి సొంతంగా బాటలు వేసుకోవడం అవసరమా? అన్నది తండ్రులు తేల్చుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: