మాజీ స్పీకర్ కోడెల
శివప్రసాదరావు ఆత్మహత్య (హత్య?) తర్వాత చంద్రబాబునాయుడు ఎంతలా రాజకీయం చేస్తున్నారో
అందరూ చూస్తున్నదే. పోస్టుమార్టమ్ రిపోర్టు
కూడా రాకుండానే కోడెలది ఆత్మహత్య అని చంద్రబాబు అండ్ కో తేల్చేశారు. అలాగే ఆత్మహత్య
కూడా వైసిపి ప్రభుత్వం వేధింపుల వల్లే జరిగిందని చంద్రబాబు తీర్పిచ్చేశారు.
ఒకవైపు కోడెల మెడపై గాట్లున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెబుతున్నా చంద్రబాబు అండ్ కో మాత్రం కోడెలది ఆత్మహత్యే అని పదే పదే చెప్పటం వెనుక కారణమేంటి ? కోడెల ఆత్మహత్యకు ప్రభుత్వ వేధింపులే కారణమని చెబుతున్న చంద్రబాబు ఏ రకమైన వేధింపులో మాత్రం చెప్పలేదు.
నిజానికి కోడెలను వైసిపి ప్రభుత్వం వేధిస్తోందనేందుకు ఆధారాలేమీ లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డ కాల్చి మీదేసేయటం తప్ప మరోటి కనబడటం లేదు. కొడుకు కోడెల శివరామ్, కూతురు విజయలక్ష్మిలను అరాచకాలకు పాల్పడమని వైసిపినే చెప్పిందా ? అప్పుడు అరాచకాలకు పాల్పడమని చెప్పి ఇపుడు కేసులు పెడితే వేధింపులని అనుకోవచ్చు.
లేకపోతే అసెంబ్లీ ఫర్నీచర్ ను దొంగతనం చేయమని కోడెలను వైసిపి ప్రోత్సహించిందా ? లేకపోతే అసెంబ్లీ ఫర్నీచర్ ను కోడెల దొంగతనం చేసిన విషయం బయటపడిన తర్వాత ప్రభుత్వం కేసులు పెట్టటమే తప్పా ? అసెంబ్లీ ఫర్నీచర్ ను తాను సొంతానికి వాడుకున్నట్లు స్వయంగా కోడెలే రాతమూలకంగా అంగీకరించటాన్ని చంద్రబాబు సమర్ధిస్తారా ?
అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కోడెల కుటుంబ బాధితులు కేసులు పెట్టినట్లే కొందరు టిడిపి నేతలు కూడా కేసులు పెట్టారు కదా ? అందుకే కొడుకు, కూతురుపై చెరో 20 కేసులు నమోదయ్యాయి. అరెస్టు నుండి తప్పించుకునేందుకే ఇద్దరూ పరారీలో ఉన్నారు. వాస్తవాలు ఇలా వుంటే చంద్రబాబు, ఎల్లోమీడియా మాత్రం కోడెల చనిపోవటానికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ పచ్చ ప్రచారం మొదలుపెట్టటమే విచిత్రంగా ఉంది.