టీడీపీ కీలక నాయకుడు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హఠాన్మరణం ..రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా.. రాజకీయ నాయకులను కూడా ఆలోచనలో పడేసింది. 72 ఏళ్ల వయసులో ఆయన చేసుకున్న ఆత్మహత్యపై అనేక చర్చలు నడుస్తున్నాయి. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని.. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న కోడెల... ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేంత పరిణామాలు ఏముంటా యి? అనేది ప్రధాన చర్చ. అయితే, దీనిపై ఇతర పక్షాల స్పందన ఎలా ఉన్నప్పటికీ.. టీడీపీ నుంచి వెలువడుతున్న వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
కోడెల వంటి నాయకుడు ఆత్మహత్య చేసుకున్న సమయంలో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు కానీ, దేవినేని ఉమా, కేశినేని నాని, జవహర్ వంటివారు కానీ, చేస్తున్న విమర్శలు పెద్దగా పసలేక పోగా.. ఏదో తప్పు ను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా భావించాల్సి వస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ, జగన్ మీడియా కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని యనమల వంటి సీనియర్ నాయకుడు ఆరోపించడం ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకుంటున్నారా? అనే చర్చకు అవకాశం కల్పించింది. మరోపక్క, కోడెల అనేక ఉత్థాన పతనాలు చవి చూసిన నాయకుడు.
రాజకీయ జీవితంలో ఆయన అనేక పతనాలు చవిచూశారు. కేసులు ఎదుర్కొన్నారు. ఆయనే చెప్పుకొన్నట్టు ప్రజల కోసం లాఠీ దెబ్బలు తిన్నారు. అలాంటి నాయకుడు ఇప్పుడు వైసీపీ వేధింపులు తట్టుకోలేక, సాక్షి టీవీ ప్రసారాలను చూసి నిబ్బరం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం ఏమేరకు సబబో వారు ఆలోచించుకోవాలి. పార్టీ పరువును పోగొట్టడంతోపాటు, మరోపక్క, మృతి చెందిన కోడెల ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారనే ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో కావాల్సింది సంయమనం తప్ప.. విమర్శలు కావు. ఈ విషయంలో ఎందుకో టీడీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.