ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా రూపుదిదేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎలక్ట్రానిక్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని సీఎం వైయస్ జగన్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఫాక్సికన్ ఇండియా ఎండీ జోష్ ఫాల్గర్ కలిశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి ఫాల్గర్ వివరించారు.
నెల్లూరు జిల్లాలోని శ్రీ సిటీలో ఉన్నతమ కంపెనీ ద్వారా దాదాపు 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వారందరికి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. అదే విధంగా కంపెనీ ఉత్పాదక సామర్థ్య శక్తిని కూడా పెంచేందుకు తగు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు 35 లక్షల సెల్ఫోన్లు విక్రయిస్తున్నట్లు ఫాక్సికన్ ఇండియా ఎండీ తెలిపారు.ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త అవకాశాలు అంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో ఫాక్సికన్ ఇండియా ఎండీ భవిష్యత్ కార్యాచరణనను వివరించారు. ఈ క్రమంలో కంపెనీ విస్తరణపై సీఎంకు సంస్థ ఎండీ వివరాలు తెలిపారు.
ఈ సందర్బంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ఉద్దేశమన్నారు.ఆ దిశలో ఫాక్సికన్ కంపెనీ కూడా ముందుడుగు వేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అంతేకాకుండా పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.