హాంకాంగ్‌లో రోజుల తరబడి ఆందోళనలు వినూత్న రీతిలో జరుగుతున్నాయి. ఉద్యమకారులైన ఇక్కడి యువకులు చైనాకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్నచిన్న జాగ్రత్తలతో ఉద్యమబాటలో పయనిస్తున్నారు. అసలు...కొద్ది నెలలుగా హాంకాంగ్‌లో ఏం జరుగుతుందో ఓ సారి పరిశీలిస్తే... 


హాంకాంగ్‌లో కొన్ని నెలలుగా జరుగుతున్న ఆందోళనలు అక్కడి యువకులను రాటుదేల్చేశాయి. ఆందోళనకారులపై చైనా మద్దతుతో హాంకాంగ్‌ భద్రతా దళాల దురుసు వైఖరిని అడ్డుకొనేందుకు వారు తమకు అందుబాటులోని మార్గాలను ఎంచుకొని పోరాడుతున్నారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు వారు చుక్కలు చూపిస్తున్నారు. వినూత్నమైన మార్గాలను ఎంచుకొని తిరగబడుతున్నారు. వారు ఎంచుకున్న పద్ధతులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆందోళనల్లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది యువకులే. వీరిలో చాలా మంది విద్యార్థులు ఉండటంతో భవిష్యత్తుపై ప్రభావం చూపకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇప్పటికే హాంకాంగ్‌ ప్రభుత్వం దాదాపు 1,450 మందిని అదుపులోకి తీసుకొంది. 


ఐతే ప్రజలపై నిఘా వేయడంలో చైనాను మించిన దేశం లేదు. తన ఆధీనంలోని హాంకాంగ్‌లో అడుగడుగునా సీసీ కెమెరాలను అమర్చింది. వీటి సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఆందోళనకారులపై దృష్టిపెట్టింది. దీంతో ఆందోళనకారులు వీటిని తప్పించుకోవడానికి ముఖాలను స్కార్ఫులతో దాచుకుంటున్నారు. దీంతోపాటు ప్రభుత్వ దళాలు వినియోగించే టియర్‌ గ్యాస్‌ వంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మాస్కులను వాడుతున్నారు. మరికొందరు కెమెరాలకు ముఖం కనిపించకుండా గొడుగులు అడ్డం పెట్టుకొంటున్నారు. దీంతో హాంకాంగ్‌ భద్రతా దళాలు చేతితో కెమెరాలను పట్టుకొని ఆందోళనకారులను చిత్రీకరిస్తున్నాయి. దీనిని గమనించిన ఆందోళనకారులు నీలి, ఆకుపచ్చ రంగు లేజర్‌ లైట్లను వినియోగిస్తున్నారు. కారుచౌకగా దొరికే ఈ లైట్ల కాంతిని కెమెరాలపైకి ప్రసరింపజేస్తుండటంతో అధికారులకు చిత్రీకరణ సాధ్యం కావడంలేదు. అదే క్రమంలో ఆందోళనకారులు మొత్తం నల్లరంగు దుస్తులతోపాటు గాగుల్స్‌, హెల్మెట్లు ధరించి ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైపోతున్నారు. 


ఇక ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహించే మార్గంలోని కెమెరాలను నిర్వీర్యం చేసేందుకు స్ప్రేపెయింట్లు, టేపులు వినియోగిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించి ఆందోళన నిర్వహించే ప్రాంతానికి చేరుకొనే వారు నగదు రూపంలో టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. సబ్‌వే ఫెయిర్‌ కార్డులను వినియోగిస్తే ప్రభుత్వ వర్గాలు పసిగట్టేస్తాయని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ఆందోళనల్లో పాల్గొనేవారు తమ వద్ద  ఉన్న గుర్తింపు, ఇతర కార్డులను అల్యూమినియం కాగితంలో చుట్టేసి పెడుతున్నారు. దీంతో ఆ కార్డుల నుంచి ఎటువంటి సమాచారాన్ని భద్రతా దళాలు పసిగట్టలేకపోతున్నాయి. ఫలితంగా వీరిని అదుపు చేయడంలో భద్రతా దళాల తల ప్రాణం తోకకు వస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: