మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై చంద్రబాబు రోజూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వ హత్యే అని కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ చంద్రబాబుకు ఓ సవాల్ విసురుతోంది. కోడెల శివప్రసాదరావుపై అంత ప్రేమ ఉంటే.. ఆయన కుమారుడు, కుమార్తెలను నరసరావుపేట, సత్తెనపల్లెకు ఇన్చార్జ్లుగా చేయండి.. అని వైసీపీ సవాల్ విసురుతోంది.
మరి ఈ సవాల్ కు చంద్రబాబు ఎలా స్పందిస్తారో.. చూడాలి. ఇదే విషయాన్ని ఓ విలేఖరి అడిగినప్పుడు చంద్రబాబు విషయం దాటవేశారు.. ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ హుంకరించారు. కోడెల శివప్రసాదరావుపై చంద్రబాబు ఇప్పుడు రాజకీయాల కోసమే ప్రేమ చూపుతున్నారన్నది వైసీపీ ఆరోపణ.
కోడెల మరణానికి కారణం వారి కుటుంబ సభ్యులే అంటోంది వైసీపీ. టీడీపీ రెండో కారణమని అంటోంది. కోడెల ఓటమి తరువాత ఆయనపై కేసులు పెడితే టీడీపీ నాయకులు ఒక్కరూ కూడా సపోర్టు చేయలేదు.. ఎందుకు పార్టీ పట్టించుకోలేదు? ఇది కోడెల మదిలో మదిలిన ప్రశ్న. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో వచ్చిన నాయకుడు కోడెల. ప్రారంభం నుంచి టీడీపీలోనే ఉన్నారు. పక్క పార్టీ వైపు కూడా తొంగి చూడలేదు. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే చంద్రబాబు ఆదేశాల మేరకు కోడెల వారిపై అనర్హత వేటు వేయలేదు.
మేం ఆరోపణలు చేస్తే చంద్రబాబు ఏ నాడు కూడా ఖండించలేదు. వర్లా రామయ్యను పంపించి ఏం మాట్లాడారు. ఆగస్టులో గుండెపోటుతో కోడెల జాయిన్ అయితే ఎవరు పట్టించుకోలేదు. వాస్తవానికి అది గుండెపోటు కాదు..దాన్ని కప్పిపెట్టారు. లక్ష్మీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రికి 50 మీటర్ల దూరంలోనే టీడీపీ ఆఫీస్ ఉంటుంది. నాలుగు సార్లు టీడీపీ ఆఫీస్కు వచ్చిన చంద్రబాబు ఒక్కసారి కూడా వెళ్లి కోడెలను పరామర్శించలేదు. టీడీపీ నేతలు వెళ్లి చంద్రబాబును బతిమాలినా కూడా ఆయన వెళ్లలేదు.. అంటూ వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.