తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆసరా పెన్షన్ దళారుల చేతుల్లో పడింది. హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన పెన్షన్ స్కామ్ పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. వృద్ధులకు అందాల్సిన భరోసా డబ్బులు ఇప్పుడు కేటుగాళ్లు కొట్టేస్తున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఆసరా పెన్షన్ల అక్రమాలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. చార్మినార్ ఎమ్మార్వో జుబేదాపై బదిలీ వేటు వేసింది.
ఆసరా పెన్షన్ డబ్బుల మోసాలపై హైదరాబాద్ ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశామని హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఈ కేసులో ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.350 మందికి చెందిన పెన్షన్ లను పదిమంది ముఠా బినామీ పేర్లతో స్వాహా చేసింది. నెలలు గడుస్తున్నా పెన్షన్ రాకపోవడంతో కలత చెందిన వృద్ధులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. రికార్డుల్లో నెలనెల తీసుకున్నట్టు ఉన్నా, బాధితులంతా తమకు అందలేదని చెప్పడంతో హైదరాబాద్ కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో మోసం జరిగిందని తెలుసుకొని సిసిఎస్ లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినార్ పరిధిలో పెద్ద ఎత్తున ఆసరా పెన్షన్ల అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ప్రభుత్వం...చార్మినార్ ఎమ్మార్వో జుబేదాపై బదిలీ వేటు వేసింది. అడుగులు వేయలేని పరిస్థితి, శరీరం సహకరించలేని దుస్థితి అలాంటి వృద్ధులను చూస్తే ఎవరికైనా అయ్యోపాపం అనిపిస్తుంది. కానీ ఈ ముఠా వారికి చెందాల్సిన పెన్షన్ ని కూడా పక్కదారి పట్టించి చివరకు పోలీసుల చేతులకు చిక్కి కటకటాలు లెక్కించింది.