ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఆత్మహత్యపై సీబీఐ చే విచారణ జరిపించాలని గవర్నర్ కలిసి పిర్యాదు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అందుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసేందుకు ఇప్పటికే ఆపాయింట్మెంట్ తీసుకున్నారట. ఏపీలో ఇప్పుడు కోడెల శివప్రసాదరావు మృతి చర్చనీయాంశంగా మారింది. కోడెల ఆత్మహత్యకు పరోక్షంగా ఏపీ ప్రభుత్వం పురిగొల్పిందని చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.
అయితే కోడెల ఆత్మహత్య వ్యవహారంపై ఏపీ గవర్నర్ ని కలిసి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. రేపు మధ్యాహ్నాం రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ని టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో కలువనున్నారు. కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ దర్యాప్తుకు టీడీపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆత్మహత్యకు పురిగొల్పే విధంగా టీడీపీ నాయకులను ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
రేపు ఉదయం చంద్రబాబుతో టీడీపీ సీనియర్ నాయకులు సమావేశమై వీటన్నింటిపై చర్చించి ఓ వినతిపత్రంతో గవర్నర్ ని కలవనున్నట్లు తెలుస్తోంది. కోడెల శివప్రసాదరావు మృతిని రాజకీయం చెయ్యోద్దని ఓవైపు కోడెల కూతురు అన్ని రాజకీయ పార్టీలను వేడుకుంటుంటే చంద్రబాబు మాత్రం దుందుడుకుగా ముందుకు పోతున్నారు. అసలు కోడెల శివప్రసాదరావుపై కేసులు పెడితే నిజాయితీ నిరూపించుకోవాల్సింది పోయి ఆత్మహత్య చేసుకోవడం, దాన్ని చంద్రబాబు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కాదేది రాజకీయానికి అనర్హం అన్నది చంద్రబాబుకు ముందు నుంచి బాగా తెలుసు. గతంలోనూ బాబు శవ రాజకీయాలు చేయడంలో తనకు తానే దిట్ట అనిపించుకున్నట్టు ఆరోపణలు ఆయనపై ఉండనే ఉన్నాయి. హరికృష్ణ శవం దగ్గర కూడా తనతో బాబు పొత్తులపై మాట్లాడారని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ కొత్త రాజకీయంతో బాబు ఏం సాధిస్తారో ? చూడాలి. ఏదేమైనా ఇప్పుడు కోడెల వ్యవహరం ఎటుపోయి ఎటు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.