రోజు రోజుకు సమాజంలో చైతన్యమనేది అడుగంటుతున్నట్లుగా అనిపిస్తుంది.లేకపోతే ఓ వైపు చంద్రయాన ప్రయాణాలు,మరో వైపు అందుకోలేనంత స్దాయిలో వున్న ఆలోచనలతో మానవుడు ఊహించనంతగా అభివృద్దిని సాధిస్తున్న తరుణంలో మనం కంఫ్యూటర్ కాలంలో ఉన్నామని గొప్పగా చెప్పుకునే తరుణంలో ఆటవిక జాతులు ఆచరించే ఆచారాలను ఇంకా పాటిస్తున్నారు కొందరు.అనుమానం అనే తెరచాటున ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడటం లేదు.ఓ వైపు పోలీసులు,మరో వైపు సమాజంలో మూఢాచారాలను తొలగించాలని కంకణం కట్టుకున్న సామాజిక కార్యకర్తలు వీటిపై ముమ్మురంగా ప్రచారం చేస్తుంటే,అవేమి ఆలోచించకుండా తప్పులు చేసి ఆనక జైలు పాలవ్వుతున్నారు.



ఇలాంటి వారు చేసే తప్పు వల్ల కుంటుంబాలు రోడ్డున పడుతున్నాయి.పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదు.అది తెలిసి మరో ప్రాణాన్ని తీయడమనేది చెప్పలేనంత దారుణం. మంచి చెడులు ఆలోచించకుండా చేసే ఇలాంటి చర్యలవల్ల జరిగే నష్టాన్ని పూడ్చగలగడం సాధ్యమా.ఇప్పుడు ఇలాంటి సంఘటనే జరిగింది.తెలివి తక్కువ తనమో,లేక అత్యుత్సాహమో కాని ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.వివరాల్లోకి వెళ్లితే శామీర్‌పేట మండలంలోని అద్రాస్‌పల్లిలో దారుణం జరిగింది.అదేమంటే చేతబడి చేశాడన్న నెపంతో యువకుడు ఆంజనేయులు(24) దారుణహత్యకు గురయ్యాడు.



చేతబడి చేయడంతోనే లక్ష్మీ అనే మహిళ చనిపోయిందని భావించిన మృతురాలి తాలుకూ బంధువులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఆయువకున్ని కొడుతూ,తనకే పాపం తెలియదని వేడుకుంటున్న వినకుండా లక్ష్మీ చితిపైనే యువకుడ్ని వేసి సజీవదహనం చేశారు.మహిళ చితిపైనే బలవంతంగా యువకుడిని పడుకోబెట్టి...చితికి నిప్పు అంటించారు.దీంతో..సదరు యువకుడు ఆర్తనాదాలు చేస్తూ సజీవదహనం అయ్యాడు.ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్దితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇక ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: