భారీ వర్షాలు, వరదలతో ఉత్తరభారతరం అతలాకుతలమవుతోంది. గంగ, యమున నదులు వరదతో నిండుకుండలా మారాయి. ప్రయాగరాజ్‌  లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. భారీవర్షాల హెచ్చరికలతో ముంబయి వణికిపోతోంది. 


ఉత్తరాదిన కురుస్తోన్న వర్షాలకు గంగా, యమునా నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగింది. కుండపోత వర్షాలతో భారీ వరద నీరు చేరుకోవటంతో..తీరప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. గంగాయమునా నదుల్లో భారీగా వరదనీరు చేరడంతో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భవనాలు సగం వరకు నీటమునిగాయి. నదుల్లో వరదనీరు పోటెత్తడంతో నదుల పరివాహక ప్రాంతాల్లోని  ప్రజలను అప్రమత్తం చేశారు. 


గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్ లో గంగ, యమునా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. ముఖ్యంగా వారణాసి, అలహాబాద్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను అప్రమత్తం చేశారు. గంగ, యమునా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని యూపీ  ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 


యమునా నది పొంగి పొర్లుతుండడంతో బుందేల్ ఖండ్ రీజియన్ తో పాటు హమీర్పూర్, బందా, చిత్రకూట్ జిల్లాల్లో పలు ప్రాంతాలు నీటి ముంపునకు గురయ్యాయి. యమునతో పాటు కెన్, బెట్వా నదులు కూడా పొంగి ప్రవహిస్తుండడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. రోడ్లు తెగిపోయాయి. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే నిర్వహించి, వంతెనల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో ఇంతవరకు అధికారిక లెక్కల ప్రకారం 14మంది మరణించినట్టు  సమాచారం. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయిల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు.


వాణిజ్య నగరం ముంబై వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాబోయే 48 గంటల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబై, రాయ్ గడ్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబయిలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలను మూసివేశారు. ముంబై, థానే, కొంకణ్ ప్రాంతాల్లో  స్కూళ్లు మూతపడ్డాయి. 


రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమమవుతున్నాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: