పాలన అనగానే సహజంగానే తీవ్రమైన ఒత్తిళ్లు.. అనేక మంది సలహాలు సూచనలు, వీటినిమించిన సమ స్యలు, వీటన్నింటినీ అధిగమించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు... ఊపిరి సలపనంతగా పని.. ఇవన్నీ సర్వసాధారణం. వీటికితోడు ఒక సమస్య పరిష్కారం అయ్యేలోగానే మరో సమస్య తెరమీదికి రావడం.. వంటివి కూడా కామనే. అయితే, వీటిని పరిష్కరించే క్రమంలోనే అనేక ప్రభుత్వాలు.. అప్పటి వరకు ఉన్న షెడ్యూల్ను ఓవర్ టేక్ చేయడం అనేది కూడా కామన్గా మారిపోయింది. ఏ ప్రభుత్వంలోనైనా ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయి.
ఈ క్రమంలో అనుకున్న పనిని.. అనుకున్న సమయానికి పూర్తి చేయడం, నిర్దేశిత సమయంలోగా చేస్తామని చెప్పిన పనులను వాయిదా వేయడం సహజంగా జరిగేదే. ఇక, ఆయా విషయాలను సంబంధిత వర్గాలు మళ్లీ మళ్లీ ప్రభుత్వానికి గుర్తు చేస్తేనే వాటిపై అధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ మళ్లీ దృష్టిపెట్టడం మనం అనేక సందర్భాల్లో గత ప్రభుత్వ హయాంలో చూశాం. అంతేకాదు, ఏదైనా సమస్యపై కమిటీని వేస్తే.. ఇక, ఆ కమిటీ మళ్లీ తన పని తాను చేసుకునేంత వరకు కన్నెత్తి కూడా చూడరు.
మళ్లీ మళ్లీ సమయాన్ని పొడిగించడం, కమిటీలంటే కాలయాలన మాదిరిగా చేసిన సందర్భాలు కూడా మనం చూశాం. కానీ, వీటికి భిన్నంగా ఓ టైమ్ షెడ్యూల్ పెట్టుకుని, ఖచ్చితంగా అనుకున్న సమయానికి అనుకున్న పనిని, అనుకున్నట్టు చేసే ప్రబుత్వం ఏదైనా ఉందని అంటే అది నిజంగా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పాల్సి వస్తే.. అది జగన్ ప్రభుత్వమే. కమిటీలను నియమించడం అనేది జగన్ ప్రభుత్వంలోనూ కనిపిస్తోంది. అదేసమయంలో నిర్ణయాల విషయంలోనూ ఆయన తీసుకుంటూనే ఉన్నారు. అయితే, వీటికి పెడుతున్న సమయం ప్రకారం వాటిని పూర్తి చేయడమే ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తున్న విషయం.
పోలవరం లోతుపాతులు, రివర్స్ టెండరింగ్స్పై జగన్ ఓ కమిటీని వేశారు. దీనికి నాలుగు వారాల సమయం ఇచ్చారు. అంతే! నాలుగో వారం గడిచేలోగానే కమిటీ తన నివేదికను అందించింది. ఈ నివేదిక లోని అంశాలను జగన్ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించడమే కాకుండా రివర్స్కు పిలుపు కూడా ఇచ్చింది. ఇక, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సుజాతారావు కమిటీని వేశారు. ఈ కమిటీకి కేవలం 3 వారాల సమయం మాత్రమే ఇచ్చారు. యుద్ధ ప్రాతిపదికన ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయి పరీశీలన చేసింది. నివేదిక అందించింది.
అదే సమయంలో పథకాలు కూడా అంతే.. నిర్దేశిత సమయానికి ప్రారంభించాలని అనుకున్న పథకాలను ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రారంభిస్తున్నారు. నాణ్యమైన బియ్యం పథకాన్ని ఈనెల 9న ప్రారంభిస్తామని(సెప్టెంబరు తొలివారంలో) సీఎంగా ప్రమాణం చేసిన సమయంలో జగన్ చెప్పారు. అంతే ప్రారంభించేశారు. గ్రామ వలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15 నుంచే రంగంలోకి దింపుతామన్నారు. అది కూడా జరిగిపోయింది.
ఇక, లక్షా 40 వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీని అక్టోబరు 2నాటికి పూర్తి చేసి ప్రజలకు చేరువ చేస్తామని వాగ్దానం ఇచ్చారు. అది కూడా దాదాపు పూర్తయింది. ఇలా ఒక టైం పెట్టుకుని పూర్తి చేయడం అనే విషయంలో కేంద్రాన్ని కూడా మించిన సాహసంతో ముందుకు నడుస్తున్న జగన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.