ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ , టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు వైకాపా సర్కారు వేధింపులే కారణమని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కోడెల కుటుంబానికి రాజకీయంగా దన్నుగా నిలవాలని నిర్ణయించుకుంది . కోడెల తనయుడు కి తెలుగుదేశం పార్టీలో కీలక పదవి ఇవ్వడంతోపాటు, పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కోడెల శివప్రసాదరావు పోటీచేసి అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కోడెల తనయుడు కి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకోవడం వెనుక వైకాపా చేస్తున్న ఆరోపణలే ప్రధాన కారణమని తెలుస్తోంది.
కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆయన్ని పూర్తిగా దూరం పెట్టిందని వైకాపా నాయకులు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే . కోడెల కుటుంబాన్ని కేసులు వెంటాడడం తో , రాజకీయంగా తమకు నష్టాన్ని చేకూరుస్తుందని దూరం పెట్టిన టీడీపీ నాయకత్వం , ఇప్పుడేమో ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల చనిపోయారంటూ అసత్య ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు . టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన్ని కలవడానికి ఇష్టపడలేదని , అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వైకాపా నేతలు పలువురు ఆరోపించిన విషయం తెల్సిందే .
వైకాపా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలంటే , కోడెల శివరాం కు పార్టీ పరంగా ప్రాధాన్యత ఇవ్వడమే బెటరన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. శివ రామ్ కు పార్టీపరంగా కీలక పదవి అప్పగించడంతో పాటు సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా, వైకాపా నాయకత్వం తమపై తప్పుడు ఆరోపణలను చేస్తోందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపడంతో పాటు, కోడెల కుటుంబానికి తాము అండగా ఉన్నామన్న భరోసాను కూడా కల్పించవచ్చని చంద్రబాబు యోచిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.