ఆయన ఓ బీహార్ మంత్రి.. తెలంగాణ పర్యటనకు వచ్చారు.. ఇక్కడి విధానాలు చూసి తెగమెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే వ్యవసాయ రంగంలో విశేష ఫలితాలు సాధిస్తోందని కామెంట్ చేశారు. ఆయనే బీహార్‌ వ్యవసాయశాఖ మంత్రి ప్రేమ్‌కుమార్‌. ఆయన విత్తన ధృవీకరణ సంస్థ కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో భేటీ అయ్యారు.


రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణలో ఉన్నఅవకాశాలు, మౌలిక సదుపాయాల గురించి రెండు గంటలపాటు మంత్రి నిరంజన్‌రెడ్డి వారికి వివరించారు. కొత్తఏర్పడిన రాష్ట్రమైనా కొద్దిరోజుల్లోనే గణనీయమైన పురోగతి సాధించిందని, ఇక్కడి వ్యవసాయ విధానం భేష్‌గా ఉందని బీహార్‌ వ్యవసాయశాఖ మంత్రి కితాబు ఇచ్చారు.


తెలంగాణ వ్యవసాయ పథకాలు, విత్తన పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆదర్శంగా తీసుకుని బీహార్‌లో కృషి రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తామని అన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి మొక్కజొన్న, బీహార్‌నుంచి విత్తనాల దిగుమతికి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. బీహార్‌లో విత్తన పరిశ్రమ అభివృద్ధికి కొత్త విత్తన పాలసీని తీసురాబోతున్నామని ప్రేమ్ కుమార్ అన్నారు. సూక్ష్మనీటిపారుదల రంగం, విద్యుత్‌రంగంలోకొత్త సంస్కరణలు తెస్తున్నామని చెప్పారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ సహకారం కావాలని కోరారు.


తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి పరిస్థితులు , అవకాశాలు, మౌలిక సదుపాయాలు ఉండడం వల్లనే జాతీయ, అంతర్జాతీయ స్ధాయి పరిశోధన సంస్థలు, విత్తన కంపెనీలు తెలంగాణలో నెలకొన్నాయని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నుంచి దాదాపు 18 దేశాలకు విత్తన ఎగుమతి జరుగుతోందని, అంతర్జాతీయ విత్తన ధృవీకరణ పద్దతి ద్వారా మున్ముందు మరిన్నిదేశాలకు విత్తన ఎగుమతులు పెంచుతామని అన్నారు. రాష్ట్రంలో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాల సరఫరా వల్ల వ్యవసాయంలో దిగుబడులు పెరుగుతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: