తెలుగుదేశం పార్టీ (టీడీపీ ) వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ )లో చేరాలనుకున్నా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కి ఆ పార్టీ తలుపులు మూసుకు పోయాయా? అంటే అవుననే వాదనలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి . తాను బిజెపిలో చేరనున్నట్లు వారం రోజుల క్రితమే ఆదినారాయణ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పానని పేర్కొని, హస్తిన కు బయల్దేరి వెళ్లారు .
టీడీపీ ని వీడి బిజెపిలో చేరడమే మేలని భావించిన ఆది, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా , కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా లలో ఎవరో, ఒకరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు . వారం క్రితమే పార్టీ లో చేరుతానని , ఆదినారాయణ రెడ్డి ప్రకటించినప్పటికీ , ఇంత వరకూ బిజెపి నాయకత్వం మాత్రం ఆయన కు అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఆది చేరిక పట్ల ఆ పార్టీ పెద్దలు మాత్రం పెద్దగా ఆసక్తి ప్రదర్శించడం లేదని తెలుస్తోంది . దానికి ప్రధాన కారణం తెలుగు దేశం నుండి బీజేపీ లో చేరిన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేషేనని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
కడప జిల్లాకే చెందిన సీఎం రమేష్ కు మొదటి నుంచి ఆదినారాయణ రెడ్డి తో రాజకీయంగా విభేదాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఆదినారాయణరెడ్డి ని రాజకీయంగా ఇబ్బందులు పాలు చేసేందుకు సీఎం రమేష్ ప్రయత్నించారని ఆది వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు టికెట్ ఆదినారాయణరెడ్డి దక్కకుండా, చంద్రబాబు వద్ద చక్రం తిప్పింది కూడా సీఎం రమేషేనని ... ఇప్పుడు బిజెపిలో చేరకుండా అడ్డుకుంటున్నది ఆయనేనని వారు మండిపడుతున్నారు.