చాలా సందర్భాల్లో బ్యాంకు లావాదేవీల విషయంలో ఖాతాదారులు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉంటాయి. వినియోగదారుల ఖాతాల నుండి డబ్బు కట్ అయినా ఏటీఎం నుండి రాకపోవటం, ఖాతాల నుండి డబ్బులు కట్ అయిన తరువాత అవతలి వ్యక్తికి చేరకపోవటం ఇలాంటి సమస్యలపై ఫిర్యాదులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కొరకు ఆర్బీఐ ఖచ్చితమైన నిబంధనలను ఏర్పాటు చేసింది. 
 
ఇప్పటినుండి బ్యాంకు ఖాతా నుండి ఏ కారణం చేతనైనా డబ్బు కట్ అయి అవతలి వ్యక్తికి లేదా సంస్థకు చేరని పక్షంలో నిర్దిష్ట గడువులోగా ఆ నగదు వినియోగదారుని ఖాతాకు చేరాలి. లావాదేవీ ఫెయిల్ అయిన ఒక రోజు నుండి 5 రోజుల్లోపు ఆ మొత్తం ఖాతాదారునికి చేరాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. గడువులోపు వినియోగదారుని ఖాతాలో ఆ మొత్తం చేరకపోతే రోజుకు 100 రూపాయల చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. 
 
నగదు లభ్యత లేకపోయినా, కమ్యూనికేషన్ ఫెయిల్యూర్, టైం ఔట్ సెషన్స్ లాంటి వైఫల్యాలపై బాధ్యతను బ్యాంకులే మోయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అక్టోబర్ 15వ తేదీ నుండి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారుని ఖాతా నుండి డబ్బు కట్ అయినా, ఏటీఎం నుండి నగదు రాకపోయినా లావాదేవీ జరిపిన ఐదు రోజుల్లోగా ఆ నగదు ఖాతాలోకి చేరాల్సి ఉంటుంది. 
 
ఖాతాలో చేరని పక్షంలో 6వ రోజు నుండి రోజుకు 100రూపాయల జరిమానా చొప్పున బ్యాంకులు చెల్లించాల్సి ఉంటుంది. కార్డ్ నుండి కార్డ్ కు లావాదేవీ జరిపినపుడు ఒకరోజులోపు, పీఓఎస్, ఈ కామర్స్ ద్వారా జరిపిన లావాదేవీలకు ఐదు రోజుల లోపు, ఐఎంపీఎస్ ద్వారా జరిపిన లావాదేవీలకు ఒకరోజులోపు డబ్బు అటువైపు వ్యక్తి ఖాతాలో జమ కాని పక్షంలో వాపస్ రావాల్సి ఉంటుంది. యూపీఐ చెల్లింపులకు కూడా ఇవే నియమ నిబంధనలు వర్తిస్తాయి. సమస్య తీరని పక్షంలో వినియోగదారులు రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కు ఫిర్యాదు చేయవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: