ఏపీలో తాజా ఎన్నికల్లో ఘోర ఓటమితో చాలా వరకు కుంగిపోతోన్న విపక్ష టీడీపీకి వరుస పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసలే పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలోకో ? లేదా ? వైసీపీలోకో వెళ్లిపోతున్నారు. ఈ షాకులు ఇలా ఉంటే ఇక ఇప్పుడు పార్టీకి చెందిన సీనియర్ నేతలు మృతి చెందుతుండడంతో పార్టీ శ్రేణులతో పాటు పార్టీ అధినేత సైతం షాక్ అవుతున్నారు.
నాలుగు రోజుల క్రితమే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్ రావు మృతి చెందారు. పార్టీ శ్రేణులు కోడెల మృతి నుంచి కోలుకోనే లేదు. ఆ వెంటనే ఇప్పుడు మరో సీనియర్ నేత, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ మృతితో పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆయన పార్టీకి బలమైన వాయిస్ వినిపించారు.
2004లో సత్యవేడు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు చంద్రబాబు 2009లో చిత్తూరు ఎంపీ సీటు ఎస్సీలకు రిజర్వ్ అవ్వడంతో ఆ సీటు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇక సిట్టింగ్ ఎంపీ హోదాలో 2014లో ఆయన మరోసారి పోటీ చేసి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఇక ఈ ఎన్నికలకు ముందు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి చేపట్టాలని ఆశపడ్డారు.
అయితే చంద్రబాబు మాత్రం ఆయన్ను మళ్లీ ఎంపీగానే పోటీ చేయించారు. ఎస్సీ సామాజికవర్గంలో జిల్లాలోనే కాకుండా జాతీయ స్థాయిలో పార్లమెంటులో ఆయన అనేక సమస్యలపై తన విచిత్రమైన వేషాలతో పోరాటం చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదనే చెప్పాలి. ఏదేమైనా చంద్రబాబుకు వరుస ఎదురు దెబ్బల పరంపరలో శివప్రసాద్ మృతి కూడా మరో ఎదురు దెబ్బ అనే చెప్పాలి.