వారిద్దరూ రాజకీయంగా కీలక నాయకులు. ప్రజల నుంచి వచ్చిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఒకరు వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుని ఎదిగినప్పటికీ.. సొంత అనుభవాలతో తనకంటూ ఒక ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. గెలుపు ఓటములను సైతం సమానంగా తీసుకున్నారు., అయితే, ఆ ఇద్దరు ఇప్పుడు వర్తమాన రాజకీయాల్లో ఎక్కడా కనిపించడం లేదు. వారే ఒకరు ఏపీ అసెంబ్లీకి తొలి డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించిన మండలి బుద్ధ ప్రసాద్ కాగా, రెండో వారు టీడీపీ సీనియర్ నాయకుడు కాగిత వెంకట్రావు.
మండలి వెంకట కృష్ణారావు తనయుడిగా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బుద్ద ప్రసాద్.. తొలుత కాంగ్రెస్లో ఉండేవారు. అవనిగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించిన మండలి.. రాష్ట్రాన్ని విడదీయరాదనే డిమాండ్ను గట్టిగా వినిపించారు. అయినప్పటికీ.. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడంతో ఆయన పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు ఈ క్రమంలోనే 2014లో ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఓటమి పాలయ్యారు.
వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఆయన తన వారసుడిని రంగంలోకి దింపాలని భావించారు. అయితే, పోటీ తీవ్రంగా ఉండడంతో చంద్రబాబు నిరాకరించారు. దీంతో అవనిగడ్డ నుంచి మరోసారి పోటీ చేసి గెలవాలని భావించినా.. పరాభవం పాలయ్యారు. అప్పటి నంచి మండలి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల మాజీ స్పీకర్ కోడెల హఠాన్మరణం చెందిన సమ యం లోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు. దీంతో అసలు టీడీపీలో ఉంటారా? లేక పార్టీ మారతా రా? అసలు రాజకీయాలకే దూరమవుతారా? అనేచర్చ జోరుగా సాగుతోంది.
ఇదే విధంగా మరో కీలక నాయకుడు కాగిత వెంకట్రావు పరిస్థితి కూడా ఉంది. పెడ న నుంచి పలుమార్లు విజయం సాధించిన వెంకట్రావు.. పార్టీని అభివృద్ధి చేశారనడంలో సందేహంలేదు. అయితే, రాజకీయంగా ఇప్పుడు పార్టీ కుదుపునకు గురి కావడం, పార్టీలో తన మాటలను పట్టించుకునేవారు లేక పోవడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఈయన పరిస్థితి కూడా మండలి మాదిరిగానే ఉందని, పార్టీకి దూరమవుతారా? లేక కొనసాగుతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.