హబ్బ.. చంద్రబాబు గారు ఎంత మారిపోయారో! హబ్బబ్బ.. చంద్రబాబుగారిలో ఎంత నిజాయితీ కనిపిస్తోందో ! ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై పేలుతున్న సటైర్లు ఇవి!! వెయ్యిరూపాయలకే మూడు ఫోన్లు.. అని పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ కట్టి.. ఆ కింద ఎక్కడో కనిపించీ కనిపించని విధంగా `షరతులు వర్తించును` అన్నచందంగా చంద్రబాబు రాజకీయాలు మారిపోయాయని అంటున్నారు విశ్లేషకులు.
తన ఐదేళ్ల పాలనలో తనకు నచ్చని, తాను మెచ్చని విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున యాగీకి సిద్ధమయ్యారు బాబు గారు. గ్రా మ సచివాలయ పరీక్ష పేపర్ లీక్ కావడానికి, జరిగిన అవినీతి-అక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదేనని బాబు వారు ఉవచించారు. మంచిదే.. ఏ ప్రతిపక్షమైనా.. అధికార పక్షంలోని లోపాలను వెతికి పట్టుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. కానీ, అదేసమయంలో ఆయన నిర్మాణాత్మక సూచనలు మానేసి ``పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ముఖ్య మంత్రి జగన్ రాజీనామా చేస్తారో.. లేక పంచాయతీరాజ్, విద్యామంత్రులు రాజీనామా చేయాలో నిర్ణయించు కోవాలి``- అని బాబు చెప్పుకొచ్చారు.
అయితే, ఆయన అంతటితో ఆగకుండా.. పైన చెప్పుకొన్న ప్రకటనలో.. మాదిరిగా... ``ఈ రాజీనామాల గొడవ.. మీవిజ్ఞతకే వదిలేస్తున్నా`` అంటూ ముక్తాయించారు. ఇక్కడే ఉంది అసలు కిటుకు.. మరి అంత భీకర స్వరంతో రాజీనామాలకు డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఆ వెంటనే షరతులు వర్తించును అన్నవిధంగా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాననడంలో ఏంటి మర్మం? అంటే.. ఇప్పుడు తాను ఒకటి అంటే.. వైసీపీ నుంచి వంద వస్తాయి కాబట్టి. బాబు గారి హయాంలో అనేక లోపాలు ఉన్నాయి. తన పార్టీకి చెందిన కీలక నేతను మావోయిస్టులు నడిరోడ్డుపై కాల్చి చంపినప్పుడు ఎవరు బాధ్యత వహించారు? గోదావరి పుష్కరాల్లో 23 మంది మృతి చెందినప్పుడు ఎవరు కారకులు ?
కృష్ణానదిలో బోటు మునిగి 17 మంది చనిపోయినప్పుడు ఎవరు బాధ్యత వహించారు. పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీకి ఎవరు బాధ్యులుగా నిలిచారు? వంటి అనేక ప్రశ్నలకు బాబు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అందుకే బాబుగారు ఈ విషయంలో భీకరమైన పోరు చేయాలని అనుకున్నా.. ఆయన చేసిన పనులే ఆయనకు ప్రతిబంధకాలుగా మారాయని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఏ చిన్న సందు దొరికినా ఉతికి ఆరేసే సోషల్ మీడియా.. బాబుతో ఆడేసుకుంటోంది.