బాపూజీ ఆదర్శాలే స్ఫూర్తిగా తీసుకుని ఏపీని అభివృద్ధి చేసేందుకు ముందుకు కదిలారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మహాత్ముని స్వప్నం గ్రామ స్వరాజ్యం. ఆ గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామ సచివాలయాల ద్వారానే సాధ్యమని నమ్మిన సీఎం జగన్ గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు నడుం భిగించారు. ముందుగా రాష్ట్రాన్ని మద్యరహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పించి అందుకు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే నాలుగు నెలల్లోనే 43 వేల బెల్ట్ షాపులను మూసివేశారు. మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 3,500కు తగ్గించారు.
ఇక గ్రామ స్వరాజ్యానికి నేడు అంకురార్పణ చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోకి గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చెందుకు ర గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని అందుకు తగిన విధంగా ఉద్యోగ కల్పన చేశారు. గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా కరప గ్రామంలో నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవలను 3 విభాగాలుగా అధికారులు వర్గీకరించారు.
దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందించేవి, 72గంటల్లోగా అందించేవి, 72గంటలు దాటిన తరువాత అందించే సేవలుగా విభజించారు. మొత్తం 500కు పైగా సేవలను సచివాలయాల ద్వారా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పోర్టల్ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్ను ముఖ్యమంత్రి డ్యాష్బోర్డుతో పాటు సంబంధిత శాఖలకు అనుసంధానిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పింఛన్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తదితర కీలక పథకాలను దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
72 గంటల కంటే ఎక్కువ సమయంలో 311 రకాల సేవలను అందించవచ్చని అధికారులు గుర్తించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివిధ శాఖలకు చెందిన 47 రకాల సేవలను అప్పటికప్పుడే 15 నిమిషాల్లో అందించేలాగ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 148 రకాల సేవలను దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా అందించవచ్చని అధికారులు గుర్తించారు. ఈ సేవలను గ్రామ సచివాలయం తో ప్రజల వద్దకు చేర్చేందుకు నడుం భిగించి తన తండ్రి కలలు కన్న వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు జగన్.