చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం. వాళ్ళును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా పెంచాలి. అనవసరపు ఆవేశాలకు పోయి పసిపిల్లలను తీవ్రంగా హింసించకూడదు. అది మహా నేరంతో పాటు పాపం కూడా. ఆవేశానికి పొతే జైలు జీవితం గడపాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు చెందిన నేరాలు చేయడం చట్టప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణింపబడుతుంది. చిన్నపిల్లలను కొట్టినా, వారిని అవమానించినా నేరమే.
మనదగ్గర ఈ చట్టాలు ఉన్నప్పటికీ పెద్దగా ఇంపోజ్ చేయడం లేదు. అదే విదేశాల్లో వీటిని కఠినంగా అమలు చేస్తారు. అలాంటి కఠినమైన నియమాలు మనదగ్గర కూడా రావాలి. అలా వచ్చినపుడే దేశంలో న్యాయం బతికి ఉంటుంది. చిన్నపిల్లలకు రక్షణ ఉంటుంది. బుద్దెరిగిన పెద్దవాళ్ళు చాలామంది ఇక్కడ మల, మూత్ర విసర్జన చేయకూడదు అని బోర్డులు రాసిపెట్టినా అక్కడే పోస్తుంటారు.
చిన్నపిల్లలకు ఏం తెలుస్తుంది చెప్పండి. ఒకవేళ పొరపాటున తెలియకుండా మలవిసర్జన చేస్తే.. అలా చేయకూడదు అని చెప్పాలి. లేదంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి అక్కడి ప్రాంతాన్ని శుభ్రం చేయించాలి. అంతేగాని గొడవకు దిగి కర్రలతో తలలు పగలగొడితే.. ఇంకేమన్నా ఉందా చెప్పండి. మహా నేరం కదా. ఇలాంటి సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ లోని భాగస్ పుర అనే గ్రామంలో జరిగింది.
భాగస్ పుర గ్రామంలోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన రామ్ సింగ్ అనే వ్యక్తి కుమారుడు ఆడుకుంటూ పక్కింటికి వెళ్లి వాళ్ళ ఇంటి ముందు మలవిసర్జన చేశాడు. అది చూసిన మోహర్ సింగ్.. అతని కుమారుడు ఉమేష్ లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వెంటనే రామ్ సింగ్ అతని ఏడేళ్ల కుమారుడిపై దాడి చేశారు. కర్రలతో తలపై కొట్టారు. దీంతో ఏడేళ్ల చిన్నారి అక్కడికక్కడే చనిపోగా, తండ్రి రామ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని గ్రామప్రజలు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అతని పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఈ దారుణానికి ఒడిగట్టిన మోహర్ సింగ్, ఉమేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది.