నిజాం అంటేనే....ఉండే ప్రత్యేక గుర్తింపు వేరే. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తెలంగాణలో సుపరిచితమైన నిజాం గురించి మరోమారు దేశమంతా..ఆ మాటకొస్తే...ప్రపంచమంతా తెలిసిపోయింది. ఎలా అంటే...లండన్లోని నాట్వెస్ట్ బ్యాంక్లోగల 3.5 కోట్ల పౌండ్లు (సుమారు రూ.307 కోట్లు)ఆయన వారసులకే దక్కుతాయని లండన్ కోర్టు తీర్పు చెప్పడం ద్వారా. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు చెందిన ఆ నిధులు ఆయన వారసులుగా చెప్పుకుంటున్న యువరాజులు, భారతదేశానికి మాత్రమే పొందే హక్కు ఉన్నదని లండన్లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్కు చెందిన జస్టిస్ మార్కస్ స్మిత్ తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆ సొమ్మును ఎవరెవరు పంచుకుంటారన్న దానిపై సహజంగానే...అందరి దృష్టి పడింది. ఈ ఆస్తి కోసం 120 మంది నిజాం వారసులు తెరమీదకు వచ్చారు!
లండన్లోని నాట్వెస్ట్ బ్యాంక్లోగల 3.5 కోట్ల పౌండ్లు (సుమారు రూ.307 కోట్లు) నిధుల కోసం నిజాం మనుమలు ముకరంజా, ముఫఖంజా భారత ప్రభుత్వంతో కలిసి న్యాయపోరాటం చేశారు. ఆ తరువాత నిజాం ఎస్టేట్గా ఏర్పడిన 120 మంది నిజాం వారసులు కూడా ఆ కేసులో ప్రతివాదులుగా చేరారు. వీరే కాకుండా నిజాం కుటుంబ సంక్షేమ సంస్థకు నేతృత్వం వహిస్తున్న నిజాం మరో మనుమడు నజఫ్ అలీఖాన్ కూడా కేసులో హక్కుదారుగా చేరారు. వీరందరినీ కలిపి ఇప్పుడు నిజాం ఎస్టేట్గా పరిగణిస్తున్నారు. దాదాపు ఏడు దశాబ్దాలపాటు న్యాయపోరాటం చేసి గెలుచుకున్న నిజాం నవాబు నిధులను ఆయన వారసులైన ఈ 120 మంది పంచుకోనున్నారు.
అయితే, ఇక్కడే మరో ట్విస్ట్. అదే నిజాం కుటుంబ సభ్యులు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకోవడం. పాకిస్థాన్కు భంగపాటు కలిగించాలన్న పట్టుదలతోనే హరీశ్ సాల్వే వంటి ప్రముఖ న్యాయవాదులను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించినట్టు చెప్తున్నారు. లండన్ బ్యాంక్లోని నిధుల విషయంలో నిజాం ఎస్టేట్ భారత ప్రభుత్వంతో చేసుకున్న రహస్య ఒప్పందం ప్రకారం... కేసులో హక్కుదారులుగా ఉన్న వారందరూ ఆ సొమ్మును పంచుకోవాలి. అయితే భారత ప్రభుత్వం కూడా తన వాటాను కోరుతుందా లేదా అన్నది వెల్లడి కావాల్సి ఉంది.