ఆయుధ‌పూజ....విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా జ‌రుపుకొనే కీల‌క‌మై కార్య‌క్ర‌మం. ఇంత‌టి ముఖ్య‌మైన సంద‌ర్భంలో విదేశీ గ‌డ్డ‌పై  భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. పూలు, నిమ్మకాయలతో ఫారెన్‌లోనూ దసరా సంప్రదాయాన్ని ఆచరించారు. మొదటి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని స్వీకరించడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్కడే ఆయుధపూజ కూడా నిర్వహించారు.


అయితే, తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్న భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెంటనే తన కోరిక తీర్చుకున్నారు. అధికారికంగా ఫైటర్ జెట్‌ను ఫ్రాన్స్ నుంచి అదుకున్న ఆయన ఆయుధ పూజ చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ దీనిలో ప్రయాణించాలని ఉత్సాహంగా ఉందన్నారు. రాజ్‌నాథ్ కోరిన వెంటనే ఫ్రాన్ అధికారులు ఏర్పాట్లు చేసేశారు. రాఫెల్ తయారీ కంపెనీ దసాల్ట్ హెడ్ టెస్ట్ పైలట్ ఫిలిప్ జెట్‌లోకి ఎక్కారు. రాజ్‌నాథ్‌ను తనతో పాటు రాఫెల్ లో కూర్చోబెట్టుకుని ఆకాశంలోకి దూసుకెళ్లారు. రాఫెల్ లో ప్రయాణం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ లో రైడ్ చాలా సౌకర్యంగా, స్మూత్ గా అనిపించిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నా. తాను సూపర్ సోనిక్ యుద్ధ విమానంలో ప్రయాణించే రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు.


బోర్డియాక్స్‌లో రఫేల్‌ యుద్ధవిమాన స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ..'అనుకున్న సమయానికి రాఫేల్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాఫేల్‌ రాకతో భారత వాయుసేన మరింత బలోపేతం అవుతుంది. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం అన్ని రంగాల్లో మరింత పెరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇవాళ భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సరికొత్త అధ్యాయం. రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇవాళ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారత్‌లో దసరా పండుగ(విజయదశమి) జరుపుకుంటామని, 87వ ఎయిర్‌ఫోర్స్‌ డే కూడా ఇవాళేనని' రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. గత నెలలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేలికపాటి యుద్ద విమానం తేజస్ లో రాజ్ నాథ్ సింగ్ ప్రయాణించారు. అలాగే యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య లోనూ ఆయన పర్యటించారు. సైనికుడిలా మారి మెషీన్ గన్ ను కాల్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: