ప్రజారోగ్య రంగంలో మరో విప్లవాత్మక  కార్యక్రమానికి  ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌జగన్మోహన్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10 న  “వైయస్సార్‌ కంటి వెలుగు"కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ గురువారం అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 5.40 కోట్ల మందికి నేత్ర వైద్య పరీక్షలు చేయనున్నారు. మొదట బడిపిల్లలకు కంటి వైద్య పరీక్షలు చేస్తారు. అక్టోబర్ 10 నుంచి 16 వరకు తొలిదశలో 70 లక్షల మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రెండోదశలో అవసరమైన వైద్య చికిత్సలు చేస్తారు. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్స, ఇతరత్రా వైద్య సేవలను ఉచితంగా చేపడతారు. మొత్తం ఆరు దశల్లో, మూడేళ్లపాటు వైయస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం అమలులో ఉంటుంది. మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కూడా కంటి పరీక్షలు జరుగుతాయి.ఫిబ్రవరి 1 నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు విడతల్లో ప్రజలందరికీ కంటి పరీక్షలు చేస్తారు.



ప్రజలందరికీ కంటి సమస్యలు దూరంచేయడానికి బృహత్తర కార్యక్రమం అమలును ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో  నేత్ర పరీక్షలు చేసి, వారికి అవసరమైన చికిత్సలను అందిస్తుంది. పరీక్షల నుంచి శస్త్రచికిత్సల వరకూ అన్ని సేవలనూ ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం  వైయస్‌.జగన్‌ వైద్యం, విద్య, వ్యవసాయం, ఉపాథికల్పన తనకు అత్యంత ప్రాముఖ్యతలని స్పష్టం చేశారు. ఈమేరకు మేనిఫెస్టోలో తానిచ్చిన హామీలను అమలు చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తూ, ఒక్కో కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే సమయంలో అధికారులతో సమీక్షల సందర్భంగా ఈ రంగాల్లో చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు చాలామంది పౌష్టికాహారం, రక్తహీనత లాంటి సమస్యలతోపాటు కంటి సమస్యలతోకూడా ఎక్కువగా బాధపడుతున్నారని, దీన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశాలు జారీచేశారు.



వైయస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం రూపొందింది. ప్రతి మంగళవారం స్పందనపై సమీక్ష సందర్భంగా వైయస్సార్‌ కంటివెలుగును ఎలా నిర్వహించాలన్నదానిపై  వైద్యారోగ్య శాఖ అధికారులతోపాటు, జిల్లా కలెక్టర్లతోనూ సీఎం సమీక్షించారు. సమావేశాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకుని వైయస్సార్‌ కంటి వెలుగుకు కార్యాచరణ సిద్ధంచేశారు. వైయస్సార్‌ కంటివెలుగులో భాగంగా మొదటగా సుమారు 70 లక్షల మంది బడిపిల్లలు అందరికీ ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ అన్నింటిలోకూడా ఈపరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబరు 10 నుంచి అక్టోబరు 16 వరకూ 6 పనిదినాల్లో ఈకార్యక్రమం పూర్తవుతుంది. కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ విజన్‌ సెంటర్లకు పంపిస్తారు.



జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు జిల్లాస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 160 మంది జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్లు, 1415 మంది వైద్యాధికారులు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. అన్ని పీహెచ్‌సీలకు కంటిపరీక్షలకు సంబంధించిన కిట్లను ఇప్పటికే పంపించారు. 42360 మంది ఆశావర్కర్లు, 62500 మంది టీచర్లు, 14000 మంది ఏఎన్‌ఎంలు, 14000 మంది ప్రజారోగ్య సిబ్బంది అన్ని స్కూళ్లలో జరిగే వైయస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు మొదటి విడతలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలిన మూడు, నాలుగు, ఐదు, ఆరు దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిభ్రవరి 1, 2020 నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు మొదలుపెడతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: